వివాదాస్పద వ్యాఖ్యల ముఖ్యమంత్రి మనవడ్ని చితక్కొట్టారు
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మంఝీ మనవడు అమిత్ మాంఝీని కొందరు మద్యం వ్యాపారులు చితకబాదారు. మధుబన్ జిల్లా రాణిపూర్లో పర్యటించిన ఆయన పైన స్థానిక వ్యాపారులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. తమ పైన తరుచూ పోలీసులు దాడులు జరపడానికి అమిత్ మాంఝీయే కారణమని భావించి వారు దాడికి పాల్పడ్డారు.
మాంఝీ మనవడు అమిత్ మాంఝీ సదార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీని పైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. మద్యం వ్యాపారులు అమిత్ మాఝీ పైన దాడికి పాల్పడ్డారని కాకో పోలీసుస్టేషన్ ఎస్హెచ్ఓ అమ్రేంద్ర కుమార్ చెప్పారు.
అమిత్ ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశారు. నలుగురి పైన కేసు నమోదు చేశారు. పోలీసులు ఇందుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో అమిత్ దాక్, అఖిలేష్ దాస్లు ఉన్నారు.
కాగా, బీహార్ ముఖ్యమంత్రి అయిన జితన్ రామ్ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల మరోసారి పరుష వ్యాఖ్యలు చేశారు. మాంఝీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. కేవలం 10శాతం మంది మగాళ్లు మాత్రమే తమ భార్యలతో కలిసి బయటకు వెళుతున్నారని, మిగితా 90శాతం మంది పురుషులు ఇతరుల భార్యలతో డేటింగ్ చేస్తున్నవారేనని వ్యాఖ్యానించారు.
అంతేగాక, పరస్పర అంగీకారం ఉంటే ఇలాంటి విషయాలు ఎంతమాత్రం తప్పుకాదని పేర్కొన్నారు. ‘2 నుంచి 5శాతం మంది పురుషులు మాత్రమే తమ భార్యలతో గడుపుతున్నారు. మిగతా వారందరూ ఇతరుల భార్యలతో డేట్ చేస్తున్నారు. ప్రియురాలు ఉండటం పెద్ద తప్పేం కాదు.' అని స్పష్టం చేశారు.
‘ఒకవేళ పాట్నా ఇంకో పార్కుకు వెళితే అక్కడ అవివాహితులే కాక, వివాహమైన జంటలు కూడా కనిపిస్తాయి. ఇద్దరు మేజర్లయినప్పుడు వారు శరీరక సంబంధాలు ఏర్పర్చుకోవడంలో తప్పులేదు. అది వ్యక్తిగత విషయం.' అని ముఖ్యమంత్రి మాంఝీ తేల్చేశారు.