మామిడి పండ్లకు పోలీసు భద్రత, సీఎం, మాజీ సీఎం పిల్లాటలు
పాట్నా: బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మాజీ ముఖ్యమంతి జితన్ రాం మాంఝీల మద్య మరింత రాజకీయ కక్షలు పెరిగిపోయాయి. మాజీ సీఎం మామిడి పండ్లు కోయకుండ ఉండటానికి సాయుధ పోలీసు బలగాలను రంగంలోకి దింపారు.
ఈ విషయం తెలుసుకున్న రాజకీయ విశ్లేషకులు ఇదేమి కక్షరా బాబు అంటున్నారు. బీహార్ ముఖ్యమంత్రి పదవి నుండి జితన్ రాం మాంఝీని బలవంతంగా కిందకు దింపిన విషయం తెలిసిందే. తరువాత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవిలో కుర్చున్నారు.
పదవి నుండి దిగిపోయిన జితన్ రాం మాంఝీ బీహార్ ముఖ్యమంత్రి అధికార నివాసంలోనే ఉంటున్నారు. ఆయన ఆ ఇంటిని ఇప్పటి వరకు ఖాళీ చెయ్యలేదు. ఈ ఇంటి ఆవరణంలో మామడితో పాటు వివిద రకాల పండ్ల చెట్లు ఉన్నాయి.
అక్కడ ఉన్న మామడి చెట్ల నుండి మామిడి పండ్లు కోయకుండ చూడటానికి 24 మంది సాయుధ పోలీసులను రంగంలోకి దింపారు. అందులో ఆరు మంది ఎస్ఐలు, 16 మంది కానిస్టేబుల్ లు ఉన్నారు. అందరి దగ్గర అత్యాధునిక తుపాకులు ఉన్నాయి.
విషయం తెలుసుకున్న మాజీ సీఎం జితన్ రాం మాంఝీ అనుచరులు, ఆయన పార్టీ నాయకులు మండిపడుతున్నారు. మాంఝీని బలవంతంగా ఇంటి నుండి ఖాళీ చెయ్యించాలని ఇలా మామిడి పండ్ల రక్షణ ముసుగులో అక్కడ పోలీసులతో నిఘా పెట్టారని విమర్శిస్తున్నారు.
ఒక ఉన్నతమైన ముఖ్యమంత్రి స్థానంలో కుర్చుని ఉన్న నితీశ్ కుమార్ చిన్నపిల్లలు మీద కసి తీర్చుకున్నట్లుగా మాజీ సీఎం ఇంటి దగ్గర మామిడి పండ్లు కోయకుండ ఉండటానికి పోలీసులను నియమించారని విమర్శలు వస్తున్నాయి.