నేనా.. ప్రధానా...ఆలోచనే లేదు- ప్రధాని పదవిపై నితీశ్ షాకింగ్ కామెంట్స్
బీహార్లో బీజేపీని వీడి మహాకూటమిలో పార్టీలతో కలిసి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ పై దేశవ్యాప్తంగా కొత్త ప్రచారం ఊపందుకుంది. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మోడీకి ప్రత్యర్ధిగా విపక్షాల కూటమి తరఫున ఆయన నిలబడతారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ దీనిపై స్పందించని నితీశ్ కుమార్ ఇవాళ మాత్రం మాట్లాడారు.
బీహార్లో బిజెపితో వీడిపోయిన తర్వాత తాను ప్రధాని పదవికి పోటీదారు అవుతానంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. మళ్లీ ప్రధానమంత్రి ఆశయాలు తన మనస్సులో లేవని అన్నారు. అయితే దేశంలో ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు. అందరూ కలిసి పనిచేయాలని నితీశ్ కుమార్ కోరారు. తద్వారా అన్నీ బావుంటే అప్పుడు చూద్దామనే ఆలోచన ఆయనలో ఉన్నట్లు కనిపిస్తోంది.
ఆగస్ట్ 10న బీహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మాట్లాడిన నితీష్ కుమార్.. వచ్చే ఎన్నికల్లో మోడీ మళ్లీ గెలుస్తారా అని ప్రశ్నించారు. ఆయన 2014లో గెలిచాడు, కానీ 2024లో వస్తాడా? అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు తాను "దేనికీ పోటీదారుని కాదని చెప్పారు. 2014లో వచ్చిన వ్యక్తి 2024లో గెలుస్తాడా అనేది అడగాల్సిన ప్రశ్న అని నితీశ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి మంటపుట్టించాయి.
Recommended Video
ఇవాళ ప్రధాని పదవిపై తనకు ఆలోచన లేదని నితీశ్ కుమార్ చెప్పేయడంతో విపక్షాలు దీనిపై ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. ఇప్పటికే నితీశ్ ప్రధాని అయ్యేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మిత్రపక్షం ఆర్జేడీ సహా పలు పార్టీలు ఇప్పటికే మద్దతిస్తున్నాయి. ఇప్పటి నుంచే నితీశ్ ను ప్రధాని అభ్యర్ధిగా ఫోకస్ చేస్తే ఉపయోగం ఉంటుందని విపక్షాలు అంచనా వేసుకుంటున్నాయి. కానీ నితీశ్ మాత్రం అన్నీ బావుంటే అప్పుడు దీనిపై ఓ నిర్ణయం తీసుకుందామనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది.