బీహార్ క్రైసిస్: మాంఝీకి మద్దతిస్తున్న మంత్రుల బహిష్కరణ
పాట్నా: ముఖ్యమంత్రి పీఠం విషయంలో బీహార్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ శాసనసభలో బలపరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో జెడి (యు) ఆయనకు మద్దతు ఇస్తున్న ఏడుగురు మంత్రులను పార్టీ నుంచి బహిష్కరించింది. దాంతో సంక్షోభం మరింత ముదిరింది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణపై వారిని పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తనను అడిగారని, అక్కడి సమస్యకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని తాను సూచించానని జెడి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ అన్నారు. అంచనా వేసిన చర్యలకు సిఫార్సు చేశారని, ఆ లేఖను అందుకున్న వెంటనే తాను ఆ నిర్ణయానికి ఆమోదం తెలిపానని ఆయన అన్నారు

బీహార్ ముఖ్యమంత్రిగా మాంఝీని నియమించడం తప్పిదమేనని మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. వివాదాలను ఎదుర్కుంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని మాంఝీని పార్టీ ఆదేశించిందని ఆయన చెప్పారు.
మాంఝీకి మద్దతు ఇవ్వడంపై ఆయన బిజెపిని తప్పు పట్టారు. ఒకప్పుడు మాంఝీని విమర్శిస్తూ వచ్చిన బిజెపి ఇప్పుడు మద్దతు ఇస్తోందని ఆయన అన్నారు. జనతా పరివార్ను ఏకం చేయడానికి తమ పార్టీ ప్రయత్నాలు సాగిస్తున్న సమయంలో బిజెపి దాన్ని చెడగొట్టిందని ఆయన అన్నారు. జెడి(యు)ను చీల్చాలని బిజెపి ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications