ఎన్నికల బరిలో లేకపోయినా.. ఈ రోజు వారిదే అసలైన అగ్నిపరీక్ష!
Bihar Election 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు తుదిదశ పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 20 జిల్లాల్లోని 122 స్థానాల్లో 1302 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈ దశలో నితీష్ కుమార్ మంత్రివర్గంలోని 12 మంది మంత్రుల ప్రతిష్ఠతో పాటు ఎన్నికల బరిలో లేకపోయినా తమ పార్టీల/కూటముల అభ్యర్థులను గెలిపించాల్సిన కీలక నేతలకు అగ్నిపరీక్ష ఉంది. వారిలో ముఖ్యంగా అసదుద్దీన్ ఓవైసీ, పప్పు యాదవ్, ఉపేంద్ర కుష్వాహా, జీతన్రామ్ మాంఝీ ఉన్నారు.
ఓవైసీకి సీమాంచల్లో నిజమైన సవాల్
2020 ఎన్నికలలో అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం పార్టీ సీమాంచల్ ప్రాంతంలో 5 సీట్లు గెలిచి రాజకీయ సంచలనం సృష్టించింది. ఇది మహాకూటమికి పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలలో నలుగురు ఏఐఎంఐఎంను వీడి ఆ తర్వాత ఆర్జేడీలో చేరిపోయారు. ఇప్పుడు మరోసారి ఓవైసీ తన బలాన్ని నిరూపించుకోవడానికి సీమాంచల్ ప్రాంతంపైనే పూర్తిగా ఆధారపడ్డారు. ఓవైసీ ఈసారి బీహార్లోని 25 సీట్లలో అభ్యర్థులను నిలబెట్టగా.. అందులో రెండో దశలో 17 స్థానాలు ఉన్నాయి (సీమాంచల్లో 15, చంపారన్లో 2). సీమాంచల్లో ముస్లిం ఓటర్లు కీలకం. ముస్లిం ఓట్లపై ఓవైసీ ప్రభావాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ఇమ్రాన్ ప్రతాప్గఢీని, సమాజ్ వాదీ పార్టీ ఇక్రా హసన్ను రంగంలోకి దించాయి. ఈ ఎన్నికల్లో సీమాంచల్లో గెలవలేకపోతే.. ఓవైసీ ముస్లిం రాజకీయాలపై తీవ్ర ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది.

పప్పు యాదవ్ ప్రతిష్ఠ పరీక్ష
పూర్ణియా లోక్సభ సభ్యుడు అయిన పప్పు యాదవ్ స్వయంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, ఆయన ప్రతిష్ఠ దాటిలో ఉంది. సీమాంచల్ ప్రాంతంలో కాంగ్రెస్కు కీలక నాయకుడిగా ఉన్న పప్పు యాదవ్, పూర్ణియా, సుపౌల్, అరారియా జిల్లాల అసెంబ్లీ స్థానాల్లో తన పట్టు నిరూపించుకోవాలి. ఆయన తన సన్నిహితులను ఎన్నికల బరిలోకి దించారు. వారి ప్రదర్శన సరిగా లేకపోతే అది ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. పప్పు యాదవ్ కాంగ్రెస్ అధిష్టానానికి (రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ) సన్నిహితుడిగా పరిగణించబడతారు. కాంగ్రెస్లో తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలంటే ఈ దశలో సత్తా చాటాలి.
కుష్వాహాకి చావో రేవో
RLM (రాష్ట్రీయ లోక్ మోర్చా) అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఆయనకు కేటాయించిన 6 స్థానాలలో 4 స్థానాలు ఈ రెండో దశలోనే ఉన్నాయి. సాసారం, దినారా, మధుబని, బాజ్పట్టి స్థానాల్లో కుష్వాహా అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నాలుగు స్థానాల్లోనూ రాష్ట్రీయ లోక్ మోర్చా అభ్యర్థులకు ఆర్జేడీ నుంచే గట్టి పోటీ ఎదురవుతోంది. సాసారం నుంచి స్వయంగా ఉపేంద్ర కుష్వాహా భార్య స్నేహలత పోటీ చేస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన కుష్వాహాకు తన కోటాలోని ఈ నాలుగు సీట్లను గెలిపించడం రాజకీయ ఉనికికి చాలా ముఖ్యం. తన భార్యతో పాటు మిగతా ముగ్గురు అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.
మాంఝీకి అగ్నిపరీక్ష
ఎన్డీయే మిత్రపక్షం కేంద్ర మంత్రి అయిన జీతన్రామ్ మాంఝీ (హిందుస్తానీ అవామ్ మోర్చా పార్టీ) కూడా రెండో దశలోనే అసలైన సవాల్ను ఎదుర్కొంటున్నారు. మాంఝీకి చెందిన అన్ని 6 స్థానాలు ఈ దశలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఆయనకు చెందిన ఇమామ్గంజ్, సికింద్రా, బారాచట్టి, టికారీ సిట్టింగ్ సీట్లపై ఆర్జేడీ నుంచి గట్టి పోటీ ఉంది. ఇమామ్గంజ్ నుంచి మాంఝీ కోడలు దీపా మాంఝీ, బారాచట్టి నుంచి కోడలి తల్లి జ్యోతి దేవి పోటీ చేస్తున్నారు. మాంఝీ స్వయంగా ఎన్నికల బరిలో లేనప్పటికీ తన కోడలిని, ఇతర అభ్యర్థులను గెలిపించడం ద్వారా ఎన్డీయే కూటమిలో తన ప్రాధాన్యతను నిరూపించుకోవాలి.












Click it and Unblock the Notifications