టైమ్స్నౌ-సీ ఓటర్ సర్వే: హంగ్ దిశగా బిహార్ అసెంబ్లీ: నితీష్ కుమార్కు చుక్కలే: ఆర్జేడీకి ఎడ్జ్
పాట్నా: బిహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని జనతా దళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి ఓటర్లు ఈ సారి వ్యతిరేకంగా ఓటు వేసినట్టు కనిపిస్తోంది. మూడుదశల్లో సాగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ పార్టీకి కూడా అనుకూలంగా వెలువడట్లేదు. జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. తేజస్వీ యాదవ్ నేతృత్వం వహిస్తోన్న రాష్ట్రీయ జనతాదళ్ కూటమికి ఈ సారి కొంత పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఏ కూటమికి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ లభించకపోవచ్చని స్పష్టం చేస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో జేడీయూ-బీజేపీ కూటమికి 116 సీట్లు, రాష్ట్రీయ జనతాదళ్ అలయన్స్కు 120 స్థానాలు లభించవచ్చని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. టైమ్స్నౌ, సీ-ఓటర్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఇవి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మూడుదశల్లో కొనసాగింది. చివరిదశ శనివారం సాయంత్రం 6 ముగిసింది. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడం ప్రారంభం అయ్యాయి. పలు జాతీయ న్యూస్ ఛానళ్లు, మీడియా హౌస్లు ఈ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి.
పోలింగ్ గడువు ముగిసిన కొద్దిసేపటి తరువాత వాటిని వెల్లడిస్తున్నాయి. 243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీపై ఎవరు పట్టు సాధిస్తారనేది ఈ నెల 10వ తేదీన తేలిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళశారం వెల్లడి కానున్నాయి. ఈ మూడు దశల్లో మొత్తంగా 55.4 శాతం మేర పోలింగ్ నమోదైంది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి నితీష్ కుమార్.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే సంకల్పంతో తేజస్వి యాదవ్ హోరాహోరీగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.
జేడీయూ-బీజేపీ కూటమి తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్జేడీ-కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ తదితర నేతలు వరుసగా బహిరంగ సభలు, రోడ్షోలను నిర్వహించారు. దివంగత నేత, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జన్శక్తి పార్టీ ఏ మేరకు ప్రభావం చూపించిందనేది స్పష్టం కానుంది.