షాకింగ్: కరోనా వ్యాక్సిన్ మందు లేకుండానే ఖాళీ సిరంజీతో ఇంజెక్షన్, వీడియో వైరల్
పాట్నా: బీహార్ రాష్ట్రంలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఛప్రాలోని ఓ వ్యాక్సినేషన్ కేంద్రంలో ఓ వ్యక్తికి నర్సు ఖాళీ సిరంజీతోనే ఇంజెక్షన్ ఇచ్చింది. కాగా, ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగుచూసింది. దీంతో ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
ఖాళీ సిరంజీతో ఇంజెక్షన్..
అంతేగాక, ఖాళీ సిరంజీతో ఇంజెక్షన్ చేసిన సదరు నర్సును విధుల నుంచి తొలగించారు. వ్యాక్సిన్ సీసా నుంచి మందు తీసుకోకుండా ఆ నర్సు ఖాళీ సిరంజీతో సదరు వ్యక్తికి ఇంజెక్షన్ చేయడం ఆ వీడియోలో రికార్డైంది. అక్కడున్న ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్లో ఈ వీడియో తీశారు.
ఖాళీ ఇంజెక్షన్.. తీవ్ర తలనొప్పితో బాధపడుతున్న యువకుడు
ఈ వీడియో తీసిన వ్యక్తి.. వ్యాక్సిన్ వేసుకున్న యువకుడికి ఈ విషయం చెప్పాడు. అసలు విషయం తెలిసిన ఆ వ్యక్తి ఆందోళనకు గురయ్యాడు. ఆ తర్వాత తను మరో వ్యాక్సిన్ డోసు తీసుకున్నాడా? లేదా? అనేది తెలియరాలేదు. కానీ, ఖాళీ సిరంజీతో ఇంజెక్షన్ చేసిన తర్వాత తనకు తీవ్ర తలనొప్పి ప్రారంభమైందన్నాడు. దీంతో తాను వైద్యులను సంప్రదించినట్లు తెలిపాడు.
సరదాకు వీడియో తీస్తే.. షాకింగ్ విషయం..
తన స్నేహితుడు వ్యాక్సిన్ తీసుకుంటుండగా.. తాను ఏదో సరదాకు ఈ వీడియో తీశానని వీడియో తీసిన వ్యక్తి తెలిపాడు. వ్యాక్సిన్ తీసుకున్నప్పడు తన స్నేహితుడి స్పందన ఎలావుందనేది చూసేందుకే వీడియో తీశానని చెప్పాడు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సాయంత్రం ఆ వీడియోను పరిశీలించగా.. సిరంజీ ఖాళీ ఉండటాన్ని గమనించినట్లు తెలిపాడు. సిరంజీపై ఉన్న ప్లాస్టిక్ కవర్ తొలగించిన నర్సు.. వ్యాక్సిన్ మందు తీసుకోకుండానే.. ఖాళీ సిరంజీతోనే ఇంజెక్షన్ ఇచ్చిందని గుర్తించినట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో వెంటనే సదరు వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి అధికారులకు సమాచారం అందించామని చెప్పాడు. అధికారులు సరైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపాడు. ఏదైనా సమస్య ఉంటే ఆస్పత్రికి రావాలని బాధిత యువకుడికి వైద్య సిబ్బంది చెప్పినట్లు సమాచారం. కాగా, బీహార్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 18-44ఏళ్ల యస్కులకు సుమారు 10 లక్షల మందికిపైగా తొలి వ్యాక్సిన్ డోసు ఇచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.