ఘోర విషాదం: ఆరుగురు చిన్నారులు సజీవ దహనం
పాట్నా: బీహార్ రాష్ట్రంలో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని అరారియా జిల్లా కబైయా గ్రామంలో ఓ పూరింట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడేవున్న ఆరుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మొక్క జొన్నలు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పంటుకోవడంతో ఈ ఘోరం జరిగింది.
మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ చిన్నారులు బయటకు రాలేకపోయారు. చిన్నారుల ఆర్తనాదాలు విని స్థానికులు మంటలు ఆర్పివేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ మంటల్లోనే చిన్నారులు కాలిపోయారు. ప్రమాద సమయంలో చిన్నారుల కుటుంబసభ్యులు పొలం పనులకు వెళ్లడంతో పిల్లలని కాపాడేందుకు సమయానికి ఎవరూ అందుబాటులో లేకుండా పోయారు.

అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా 3 నుంచి ఆరేళ్ల లోపు పిల్లలే. ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.












Click it and Unblock the Notifications