దారుణం : మహిళపై గ్యాంగ్ రేప్... ఆపై విద్యుత్ స్తంభానికి వేలాడదీసి...
బిహార్లో దారుణం జరిగింది. ఓ మహిళపై కొంతమంది వ్యక్తులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. ఈ ఘాతుకంతో బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. దుండగులు ఆమెను ఓ విద్యుత్ స్తంభానికి వేలాడదీసి పారిపోయారు. సమస్తీపూర్ జిల్లాలోని విభూతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... విభూతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఛకబిబ్ రుధియా గ్రామంలోని ఓ ఇంట్లో సోమవారం(మే 25) వివాహ వేడుక జరిగింది. ఆ ఇంటికి చెందిన ఓ మహిళ మరుసటిరోజు ఉదయం.. ఇంటికి సమీపంలో ఉన్న టాయిలెట్ వద్దకు మూత్ర విసర్జన కోసం వెళ్లింది. ఇదే క్రమంలో కొంతమంది వ్యక్తులు ఆమెను అడ్డగించి బలవంతంగా సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు. ఆపై ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచార సమయంలో ఆమె గట్టిగా ప్రతిఘటించగా దుండగులు ఆమెపై దాడి చేశారు.

గ్యాంగ్ రేప్ అనంతరం బాధితురాలిని విద్యుత్ స్తంభానికి వేలాడదీసి పారిపోయారు. స్థానికుడు ఒకరు బాధితురాలిని గమనించి గ్రామస్తులకు తెలియజేశాడు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన వారు అక్కడికి చేరుకున్నారు. విద్యుత్ స్తంభానికి వేలాడదీసిన బాధితురాలిని కిందకు దించారు. ఆమె ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్లు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు ఇప్పటికీ అపస్మారక స్థితిలోనే ఉండటంతో ఆమె వాంగ్మూలం నమోదు చేయలేకపోయారు.
స్థానికులు కొందరు ఈ ఘటనపై మాట్లాడుతూ... బాధితురాలి ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు సంబంధించిన ఏర్పాట్ల కోసం కొంతమంది పనివాళ్లు ఆ ఇంటికి వచ్చినట్లు చెప్పారు. వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఆరోపిస్తున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications