గ్యాంగ్ రేప్ బాధితురాలికి రూ.50 లక్షల పరిహారం.. ప్రభుత్వ ఉద్యోగం: సుప్రీంకోర్టు సంచలనం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. బాధితురాలికి సత్వర న్యాయం చేయాలని సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. నష్ట పరిహారంగా 50 లక్షల రూపాయలను చెల్లించాలని, బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలని ఆదేశించింది. దీన్ని అమలు చేయడానికి రెండు వారాల గడవు విధించింది సుప్రీంకోర్టు. గడువులోగా ప్రభుత్వం దీన్ని అమలు చేయకపోతే.. కోర్టు ధిక్కారణగా భావిస్తామని పేర్కొంది.
2002లో గోధ్రా ఘటన అనంతరం గుజరాత్ లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. మత కలహాలు చోటు చేసుకున్నాయి. ఓ వర్గం ప్రజలపై మరో వర్గం వారు దాడులకు పాల్పడ్డారు. ఆస్తులను ధ్వంసం చేశారు. గుజరాత్ వ్యాప్తంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. యథేచ్ఛగా దాడులు చోటు చేసుకుంటున్న సమయంలోనే అదే ఏడాది మార్చి 3వ తేదీన దాహోద్ జిల్లాలోని రంధిక్ పూర్ లో బిల్కిస్ బానో సామూహిక అత్యాచారానికి గురయ్యారు. అప్పటికి ఆమె వయస్సు 19 సంవత్సరాలు. నిండు గర్భిణి. అయినప్పటికీ.. దుండగులు ఆమెపై లైంగిక దాడి చేశారు.
అప్పటి నుంచీ ఈ కేసు న్యాయస్థానంలో నలుగుతూ వచ్చింది. ఈ ఏడాది ఓ కొలిక్కి వచ్చింది. రంధిక్ పూర్ ఘటనలో బిల్కిస్ బానోను బాధితురాలిగా గుర్తించింది సుప్రీంకోర్టు. ఆమెకు వెంటనే 50 లక్షల రూపాయల నష్ట పరిహారం, ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఆదేశాలను జారీ చేసింది. దీనిపై గుజరాత్ ప్రభుత్వం రివ్యూ పిటీషన్ ను దాఖలు చేసింది. బిల్కిస్ బానోను బాధితురాలిగా గుర్తిస్తూ, ఆమెకు పరిహారాన్ని చెల్లించాలని ఆదేశిస్తూ వెలువడించిన ఆదేశాలను పున: సమీక్షించాలంటూ గుజరాత్ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది.
దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. మరోసారి తన నిర్ణయానికే కట్టుబడింది. ఇందులో పున: సమీక్షించడాని ఇంకేమీ మిగల్లేదని స్పష్టం చేసింది. రెండు వారాల్లో బాధితురాలికి నష్ట పరిహారాన్ని చెల్లించాల్సిందేనంటూ తేల్చి చెప్పింది. పరిహారం చెల్లింపులో జాప్యం చేయకూడదని హితవు పలికింది. రెండు వారాల్లోగా బాధితురాలికి పరిహారం అందాలని సూచించింది. దీనితో పాటు ఈ అత్యాచారం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఉద్దేశపూరకంగా తప్పుదారి పట్టించేలా వ్యవహరించినట్లు ఆరోపణలను ఎదుర్కొన్న అప్పటి ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ భగోరాపై క్రమశిక్షణాచర్యలను తీసుకోవాలని ఆదేశించింది.