బెంగళూరు అడవిని ఊడ్చేసారు.. నెట్టింట హల్చల్ చేస్తున్న వీడియో!
ఒక్క పిలుపు.. వందల చేతులు కలిసాయి! ఒకప్పుడు మురికి కూపంగా మారిన నదిని తన ఒంటిచేత్తో శుభ్రం చేసి దేశం దృష్టిని ఆకర్షించిన ఆ యువకుడు, ఇప్పుడు ఐటీ సిటీ బెంగళూరు శివార్లలోని అడవికి కొత్త రూపం ఇచ్చాడు. ప్లాస్టిక్ వ్యర్థాలతో ఊపిరి ఆడక విలవిలలాడుతున్న అటవీ ప్రాంతాన్ని స్వచ్ఛమైన పచ్చదనంతో మెరిపించాడు. ఆ మధ్య మధ్యప్రదేశ్లో ఓ నది రూపురేఖలు మార్చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్గా మారిన 'బిట్టు తబాహి' అలియాస్ సురేంద్ర సింగ్ చౌదరి, తాజాగా కర్ణాటక రాజధానిలో చేసిన క్లీనింగ్ డ్రైవ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
నది నుంచి అడవి దాకా.. తగ్గని తపన!
మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల సురేంద్ర సింగ్ చౌదరి, సోషల్ మీడియాలో బిట్టు తబాహిగా అందరికీ సుపరిచితుడు. తన స్వస్థలంలో తీవ్రంగా కలుషితమైన అజ్నార్ నదిని శుభ్రం చేసేందుకు నెలల తరబడి కష్టపడ్డాడు. ప్రభుత్వాలు, బడా సంస్థలు చేయాల్సిన పనిని, తన సొంత ఖర్చులతో సాధానాలు కొనుగోలు చేసి నదిలోని ప్లాస్టిక్ చెత్తను ఊడ్చేసాడు. నది పాతచిత్రాలకు, తాను శుభ్రం చేశాక మారిన రూపానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో అతడికి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. ఆ ఊపుతోనే తన స్వచ్ఛ భారత్ మిషన్ను కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం చేయకుండా ఇతర రాష్ట్రాలకూ విస్తరిస్తున్నాడు.

వంద మంది సైన్యం.. జేసీబీలతో రంగంలోకి!
ఈ క్రమంలోనే బెంగళూరులోని కనకపుర రోడ్డు సమీపంలో ఉన్న ప్రసిద్ధ 'తురహళ్ళి' అడవిపై బిట్టు దృష్టి పడింది. నగరానికి అత్యంత చేరువలో ఉండే ఈ అటవీ ప్రాంతం, సందర్శకులు వేసే చెత్తాచెదారంతో నిండిపోయింది. దీంతో బిట్టు నేతృత్వంలో దాదాపు వంద మంది స్థానిక ఔత్సాహికులు, స్వచ్ఛంద కార్యకర్తలు ఏకమయ్యారు. మాస్కులు, గ్లౌజులు ధరించి అడవిలోకి దిగారు. కేవలం పైన తేలియాడే ప్లాస్టిక్ మాత్రమే కాకుండా, ఏళ్ల తరబడి మట్టిలో పూడిపోయిన వ్యర్థాలను గొనపాలు, పారలతో తవ్వి బయటకు తీశారు. భూమిలో లోతుగా కురుకుపోయిన చెత్తను తొలగించడానికి ఏకంగా జేసీబీ యంత్రాన్ని కూడా వాడారంటే వారి పట్టుదల ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.
రిసైక్లింగ్ వాహనాలు.. స్థానికుల నీరాజనాలు!
అడవి నుంచి సేకరించిన టన్నుల కొద్దీ వ్యర్థాలను పెద్ద పెద్ద బస్తాల్లో నింపి, వాటిని రిసైక్లింగ్ ప్రక్రియ కోసం ప్రత్యేక ట్రక్కుల్లో తరలించారు. ఈ కార్యక్రమానికి బెంగళూరు స్థానికుల నుంచి ఊహించని రీతిలో స్పందన లభించింది. "ప్రజా ఉపయోగ స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత. అందుకే ఈ రాష్ట్రాల పర్యటనలు చేపడుతున్నాను" అని బిట్టు తన ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా తెలిపాడు. బెంగళూరు ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని, వారి ప్రాతినిధ్యం తనలో మరింత ఉత్సాహాన్ని నింపిందని ఈ కుర్రాడు సంతోషం వ్యక్తం చేశాడు.
అంతర్జాతీయ గుర్తింపు.. తదుపరి లక్ష్యం ఏంటి?
బిట్టు చేస్తున్న ఈ నిస్వార్థ సేవకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కుతోంది. పర్యావరణ రంగంలో గ్లోబల్ స్థాయిలో పేరుగాంచిన 'ది ఓషన్ క్లీనప్' సంస్థ ఏకంగా అతనికి ఉద్యోగ ఆఫర్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. అయితే, తాను చేపట్టిన ఈ పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని ఇక్కడితో ఆపేది లేదని బిట్టు స్పష్టం చేశాడు. తదనంతరం ఏ రాష్ట్రానికి వెళ్లి చెత్తపై పోరాటం చేయాలో సూచించాలంటూ తన ఫాలోవర్లను కోరుతున్నాడు. ఏలాంటి ప్రభుత్వ నిధులు, పెద్ద పెద్ద ఎన్జీవోల అండదండలు లేకపోయినా, కేవలం ఆశయం గట్టిదైతే సమాజంలో ఎంతటి మార్పునైనా తీసుకురావచ్చని ఈ యువకుడు నిరూపిస్తున్నాడు.














Click it and Unblock the Notifications
