'నాలాలు కడిగేటోడా' అని ఎగతాళి చేశారు.. ఈ రోజు పద్మ విభూషణ్ ఇవ్వాలంటున్నారు
అధికారులు పట్టించుకోలేదు, పంచాయతీలు పట్టించుకోలేదు, మున్సిపాలిటీలు అసలే కన్నెత్తి చూడలేదు.. ఆఖరికి 'మాకెందుకులే' అని సమాజం కూడా ముక్కు మూసుకుని పక్కకు వెళ్లిపోయింది. కానీ, ఒక 20 ఏళ్ల కుర్రాడు మాత్రం ఆ మురికిని చూసి భరించలేకపోయాడు! రాజధానుల్లో కూర్చుని ఊదరగొట్టే స్వచ్ఛ భారత్ స్లోగన్ల మధ్య, మధ్యప్రదేశ్కు చెందిన ఒక సాదాసీదా యువకుడు తన సొంత చేతులతో ఒక నదినే శుభ్రం చేయడానికి నడుం బిగించాడు.
మధ్యప్రదేశ్లోని 'అజ్నార్' నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ కుప్పలను, విషపూరితమైన చెత్తను తానొక్కడే చేతులతో తీసిపారేస్తూ నెట్టింట కొత్త ప్రభంజనాన్ని సృష్టించాడు. అతని పేరు బిట్టూ తబాహి! ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ఒక కుర్రాడు ఒంటరిగా భుజాన వేసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. బిట్టూ చేస్తున్న ఈ భగీరథ ప్రయత్నానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, పౌరుల నుంచి ఆక్రోశం వెల్లువెత్తుతోంది.

ప్రజల నుంచి పన్నుల రూపంలో కోట్ల రూపాయలు వసూలు చేసే మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలు అసలు ఏం చేస్తున్నాయంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. "నగరాల్లో డ్రైనేజీలు, రోడ్లు, నదుల పరిశుభ్రతను గాలికి వదిలేసి, ఉచితంగా జీతాలు దండేసే అధికారులను తక్షణమే ఉద్యోగాల నుంచి తీసేయాలి" అని ఒక నెటిజన్ ఘాటుగా స్పందించగా.. "మున్సిపల్ కార్పొరేషన్ల దొంగలకు పన్నులు కట్టడం కంటే, ఈ కుర్రాడికే ప్రజలంతా పన్నుల డబ్బులు ఇవ్వడం మేలు" అని మరొకరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు, సర్కారు యంత్రాంగం ఉండి కూడా చేయని పనిని, చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా ఒక సాధారణ విద్యార్థి చేసి చూపిస్తుండటంతో వ్యవస్థల అసలు రంగు బయటపడింది.
చర్మం ఊడిపోతున్నా ఆగని 'ఆవేదన'..
అయితే కొందరు వ్యాపార కోణంలో ఆలోచిస్తూ, అతడు కేవలం రీల్స్, లైక్స్ కోసమే ఇదంతా చేస్తున్నాడని విమర్శలు గుప్పించారు. కానీ దీని వెనుక ఉన్న కష్టాన్ని వివరించినప్పుడు ప్రతి ఒక్కరి గుండె బరువెక్కింది. ఒక్కో ఘాట్ను శుభ్రం చేయడానికి అతనికి మూడు నెలలకు పైగా సమయం పట్టింది. నదిని క్లీన్ చేయడానికి సరైన మిషన్ తయారు చేసుకునేంత డబ్బులు లేకపోవడంతో, తానొక్కడే మురికి నీటిలోకి దిగాడు. తీవ్రమైన కాలుష్య నీటిలో నిరంతరం పనిచేయడం వల్ల అతని చేతులు, కాళ్లకు ఇన్ఫెక్షన్లు వచ్చి చర్మం ఊడిపోవడం ప్రారంభమైంది. శరీరం సహకరించకపోయినా, ప్రాణాలకు తెగించి ఆ నదిని బ్రతికించుకోవాలనే తపనతో అతడు వెనక్కి తగ్గలేదు.
'నాలాలు కడిగేటోడా' అని అవహేళనలు.. పట్టుదల వీడని కుర్రాడు!
సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించే ప్రతీ ఒక్కరికీ ఎదురయ్యే అవమానాలే బిట్టూకు కూడా ఎదురయ్యాయి. "నన్ను చూసి చుట్టుపక్కల వాళ్లు పిచ్చోడని నవ్వారు. 'ఏరా నాలా క్లీన్ చేసేటోడా.. వచ్చి మా యింటి ముందరున్న మురుగు కాలువలు కూడా కడుగు' అని ఎగతాళి చేశారు" అని బిట్టూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వంటి ప్రముఖులు కూడా అతని కష్టాన్ని ప్రశంసించినప్పటికీ, ప్రభుత్వం లేదా అధికారుల నుంచి అతనికి ఎలాంటి ఆర్థిక, యంత్ర సహాయం అందలేదు.
ప్రధాని కార్యాలయం స్పందించాలి.. ఈ కుర్రాడికి దక్కాల్సిన గౌరవం ఏది?
నెటిజన్లు ఇప్పుడు కేవలం ప్రశంసలతో సరిపెట్టడం లేదు. దేశంలో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ కు ఇతడు అర్హుడని కొనియాడుతున్నారు జెన్ జీ. దేశంలోని నదులు, చెరువులను శుభ్రపరిచే బృందాలకు ఈ కుర్రాడిని హెడ్గా నియమించి, అతనికి తగిన గుర్తింపు ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
రోజురోజుకూ కలుషితమైపోతున్న మన జలవనరులను కాపాడుకోవాలంటే, మున్సిపాలిటీలకు బుద్ధి చెప్పి, బిట్టూ లాంటి రియల్ హీరోల అనుభవాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశం మొత్తం గర్వించదగ్గ ఈ యువకుడి పోరాటం, సమాజపు నిద్రమత్తును విదిలించి కొడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు!
Padma Vibhushan is what he deserves. pic.twitter.com/wIqY5phd1a
— WarMonitor (@WarMonitorINTL) September 2, 2026














Click it and Unblock the Notifications