మీమ్స్ నుంచి మెగా ఆఫర్ వరకు.. అజ్నార్ నదికి ఊపిరి పోసిన 20 ఏళ్ల యువకుడు..
ఒక పనిని సాధించాలనే దృఢ సంకల్పం ఉంటే ఎంతటి కష్టమైన కార్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చని నిరూపించాడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ 20 ఏళ్ల సాధారణ యువకుడు. సమాజం ఏమనుకున్నా సరే లెక్కచేయకుండా, తన సొంత ఖర్చులతో చెత్తాచెదారంతో కలుషితమైపోయిన ఒక నదిని శుభ్రం చేయడానికి ఒంటరి పోరాటం మొదలుపెట్టాడు.
నెలల తరబడి నిరంతరం శ్రమించి, అవమానాలు భరించి ఆ నదికి కొత్త రూపం తీసుకువచ్చిన ఆ యువకుడి కృషికి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. సోషల్ మీడియా ద్వారా అతడి శ్రమను గుర్తించిన విదేశీ నెదర్లాండ్స్ దిగ్గజ సంస్థ, ఏకంగా తమ కంపెనీలోనే ఉద్యోగం ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా బియావ్రా గ్రామానికి చెందిన సురేంద్ర సింగ్ చౌదరి అనే యువకుడు సోషల్ మీడియాలో 'బిట్టు తబాహి'గా బాగా ప్రసిద్ధి చెందాడు. తమ ప్రాంతంలో తీవ్రంగా కలుషితమై, ప్లాస్టిక్ వ్యర్థాలు, పాచి, చెత్తాచెదారంతో నిండిపోయిన 'అజ్నార్' నది పరిస్థితిని చూసి అతడు తీవ్రంగా చలించిపోయాడు.
ఈ ఏడాది జనవరిలో ఎవరి సహాయం ఆశించకుండా నది శుభ్రత కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. తన సొంత పాకెట్ మనీ నుంచి దాదాపు రూ.30,000 వరకు ఖర్చు చేస్తూ, రోజూ గంటల తరబడి నీటిలోకి దిగి చెత్తను తొలగించాడు. నెలల వ్యవధిలోనే ఆ మురుగు నదిని పరిశుభ్రమైన జలనిధిగా మార్చేసి స్థానికులను, నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు.
'కమ్ వర్క్ ఫర్ అస్': డచ్ సీఈఓ సంచలన ఆఫర్!
ఈ నది ప్రక్షాళనకు సంబంధించిన 'బిఫోర్ - ఆఫ్టర్' ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. సముద్రాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడంలో ప్రపంచంలోనే అత్యంత ఆవిష్కరణత్మక సంస్థగా పేరుగాంచిన నెదర్లాండ్స్కు చెందిన 'ది ఓషన్ క్లీనప్' ప్రాజెక్ట్ వ్యవస్థాపకుడు, సీఈఓ బోయన్ స్లాట్ దృష్టికి ఈ వార్త వెళ్లింది. బిట్టు తబాహి కష్టాన్ని చూసి తీవ్రంగా ప్రభావితుడైన ఆ డచ్ పారిశ్రామికవేత్త, సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "మా కంపెనీకి వచ్చి మా వద్ద ఉద్యోగంలో చేరండి " అని నేరుగా ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఒక గ్రామీణ భారతీయ యువకుడికి అంతర్జాతీయ ప్లాస్టిక్ రీసైక్లింగ్ దిగ్గజ సంస్థ నుంచి పిలుపు రావడం గ్లోబల్ లెవెల్లో హాట్ టాపిక్గా మారింది.
ఆనంద్ మహీంద్రా ప్రశంసలు: మీమ్ పేజీల నుంచి మెగా ఆఫర్ వరకు!
ప్రారంభంలో కేవలం వ్యూస్, లైక్స్ కోసమే బిట్టు తబాహి ఈ పనులు చేస్తున్నాడని కొందరు విమర్శలు గుప్పించారు. అయితే, ప్రముఖ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం గతంలోనే ఇతడి కృషిని అభినందించారు. "సోషల్ మీడియాలో లైక్స్ కోసం చేసే ప్రయత్నం ఒక మంచి కార్యానికి ఉపయోగపడితే అందులో తప్పేమీ లేదు" అని చెబుతూ ఇతడిని తన మండే మోటివేషన్గా అభివర్ణించారు. నిరంతర శ్రమ, పట్టుదల ఉంటే ఎంతటి ప్రతికూలతలలనైనా దాటి విజయం సాధించవచ్చని, బిట్టు తబాహి కథే నేటి యువతకు నిదర్శనమని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.














Click it and Unblock the Notifications