800 కి.మీ కాలినడక, చెప్పులు లేవు, కడుపునిండా తిండి లేదు, గుండెను పిండేస్తోన్న వలసకూలీల వెతలు..
ఒకటి కాదు రెండు కాదు 800 కిలోమీటర్లు.. కాలినడకన గమ్యం కోసం పయనం, తమతో ఉన్న చిన్నారికి బాగోలేకపోవడంతో స్ట్రెచర్ మీద తీసుకెళ్తోన్న గుండెను కదిలించే ఘటన ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో కనిపించింది. మనస్సున మారాజు పోలీసులు వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజనం అందజేసి.. మిగతా 500 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు ట్రక్కు సమకూర్చారు. తమకు సాయం చేసిన.. పోలీసులకు 17 మంది వలసకూలీలు చేతులెత్తి దండం పెట్టారు.
తిండి లేదు...
లాక్డౌన్ వలసకూలీల జీవితాలు చిన్నాభిన్నం చేసింది. తినడానికి తిండిలేకపోవడంతో కూలీలు తమ సొంత రాష్ట్రానికి వెళుతున్నారు. పంజాబ్లోని లుధియానా నుంచి 17 మంది కూలీలు తమ సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ సింగ్రౌలికి బయల్దేరారు. గత 15 రోజుల నుంచి రెక్కలు ముక్కలు చేసుకొని.. ఎండను లెక్కచేయకుండా 800 కిలోమీటర్లు ప్రయాణించారు. యూపీలోని కాన్పూర్ చేరుకున్నాక... అక్కడ పోలీసులు వారిని చూశారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చెప్పులు కూడా లేవు..
పని లేకపోవడంతో లుధియానా నుంచి వస్తున్నామని తమ గోడును వెల్ల బోసుకున్నారు. సింగ్రౌలికి 17 మందిని బయల్దేరామని తెలిపారు. తినడానికి సరైన తిండి కూడా లేదు అని చెప్పారు. కొందరికీ చెప్పులు కూడా లేవు అని పేర్కొన్నారు. వారి పరిస్థితిని చూసి చలించిన పోలీసులు.. వారికి ఆహారం అందజేశారు. మిగిలిన దూరం వెళ్లేందుకు ట్రక్కు కూడా ఏర్పాటు చేశారు.
నడవలేని స్థితిలో చిన్నారి..
అయితే వీరిలో ఒక పిల్లాడి మెడపై గాయమైంది. దీంతో అతను నడవలేని స్థితి. కర్రలతో స్ట్రెచర్ ఏర్పాటు చేసి.. అతని అందులో 15 రోజులు తీసుకొచ్చారు. తమ బృందంలో పిల్లలకు కూడా కడుపునిండా తిండి పెట్టలేకపోయామని వారు బాధపడ్డారు. వీరేకాదు చాలామంది వలసకూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి లేక... సొంతూళ్ల బాటపట్టిన వీరంతా.. ఆందోళన చెందుతున్నారు.
Recommended Video
ప్రమాదాలు..
కొందరు నడిచి వెళ్తుంటే.. మరికొందరు సైకిళ్లపై.. మరికొందరు ట్రక్కులలో వెళ్తున్నారు. ఏ రూపంలో వెళుతోన్నా వారిని ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఆకలితో అలసట చెంది.. అనారోగ్యబారిన పడుతున్నారు. లేదంటే మరికొందరు రోడ్డు ప్రమాదాలతో చనిపోతున్నారు.