బీజేపీ మూడో జాబితా: చెన్నై సౌత్ నుంచి తమిళిసౌ సౌందరరాజన్, కోయంబత్తూర్ నుంచి అన్నామలై
న్యూఢిల్లీ/చెన్నై: లోక్సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ గురువారం మూడో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తమిళనాడుకు సంబంధించి తొమ్మిది స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan)ను చెన్నై సౌత్ నుంచి బరిలోకి దించింది బీజేపీ అధిష్టానం.
ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవితోపాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజా సేవ చేసేందుకే తాను తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు తమిళిసై ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆమెకు చెన్నై సౌత్ ఎంపీ టికెట్ కేటాయించారు.

మరోవైపు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. గతంలో 195 మందితో తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ.. ఇటీవల 72 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. తాజాగా గురువారం రాత్రి మరో 9 మంది అభ్యర్థుల పేర్లతో మూడో జాబితాను విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 276కి చేరింది.
తాజాగా 9 మంది అభ్యర్థుల వివరాలు:
కోయంబత్తూరు నుంచి కె అన్నామలై
చెన్నై సౌత్: తమిళిసై సౌందరరాజన్
చెన్నై సెంట్రల్ : వినోజ్ పి సెల్వం
వెల్లూరు: డా. ఏసీ షణ్ముగం
కృష్ణగిరి: సి నరసింహన్
నీలగిరిస్(ఎస్సీ): డా. ఎల్ మురుగన్
పెరంబలూరు: టీఆర్ పార్వేందర్
తూత్తుకుడి: నైనార్ నాగేంద్రన్
కన్యాకుమారి: పొన్ రాధాకృష్ణన్.












Click it and Unblock the Notifications