నార్త్ కింగ్: వెనుకంజలో బీజేపీ ముఖ్యమంత్రి: కాంగ్రెస్ మాజీ సీఎం పరిస్థితీ అంతే
డెహ్రాడున్: ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ వస్తోన్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవ్వాళ వెలువడుతున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం తేటతెల్లమౌతోంది. ఈ అయిదు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల భారతీయ జనతా పార్టీ పట్టు సాధించింది. నాలుగు రాష్ట్రాల్లోనూ అధికారాన్ని నిలబెట్టుకుంటోంది. ఊహించినట్టే పంజాబ్లో బీజేపీ ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. అక్కడ కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ పాగా వేసింది.
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లల్లో బీజేపీ మెజారిటీ మార్క్ను దాటింది. ఉత్తర ప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభంజనం వీస్తోంది. భారీ మెజారిటీతో దూసుకెళ్తోంది. బీజేపీకి చెందిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలకు అనుగుణంగా అక్కడ బీజేపీ తన సత్తాను చాటుతోంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందంటూ తొలుత వార్తలు వెలువడిన గోవాలోనూ బీజేపీ ఆధిక్యతను కనపరుస్తోంది.
దేవభూమిగా ఉత్తరాఖండ్లో కమలనాథులు వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీ మార్క్ను దాటుకుంది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్య 70. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 34. దీన్ని అందుకుంది బీజేపీ. 42 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థులు 24 చోట్ల ముందంజలో ఉన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ సైతం వెనుకపడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. లాల్కువా నియోజకవర్గం నుంచి హరీష్ రావత్ పోటీ చేశారు. ఆయనపై స్వతంత్ర అభ్యర్థి పవన్ చౌహాన్ ఆధిక్యతను సాధించారు. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్వాది పార్టీ రెండు చోట్ల లీడింగ్లో కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఆధిక్యతలో ఉన్న అభ్యర్థుల మధ్య ఉన్న ఓట్ల సంఖ్య స్వల్పంగా ఉండటం వల్ల తుది ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు.
Recommended Video
కాంగ్రెస్ పార్టీ దీనిపైనే ఆశలు పెట్టుకుంది. కాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధమీ కూడా ట్రయలింగ్లో ఉన్నారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రి కంటే వెనుకంజలో కొనసాగుతున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే- బీజేపీ మరోసారి తన పట్టును నిలబెట్టుకున్నట్టే అవుతుంది. వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టినట్టవుతుంది ఉత్తరాఖండ్లో. అతి తక్కువ కాలంలో ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చడం వల్ల బీజేపీకి కొంత వ్యతిరేక పవనాలు ఏర్పడొచ్చంటూ మొదట్లో వార్తలొచ్చాయి. అవేవీ పోలింగ్పై ప్రభావాన్ని చూపలేకపోయాయి. బీజేపీ ఇక్కడ పూర్తిస్థాయి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.