ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ధ్వంసం, ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి: కుమారస్వామి
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో బిఎస్ యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేశారని జెడి(ఎస్) నేత కుమారస్వామి అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామిక వ్యవస్థలను బిజెపి ధ్వంసం చేస్తున్న తీరును అందరి దృష్టికి తీసుకెళ్ళనున్నట్టు ఆయన ప్రకటించారు.ఈ విషయమై బిజెపియేతర పార్టీలతో మాట్లాడేందుకు నాన్నను రంగంలోకి దింపనున్నట్టు కుమారస్వామి ప్రకటించారు.
బీజేపీకి సాధారణ మెజారిటీ లేకపోయినప్పటికీ ఆ పార్టీ నేత యడ్యూరప్పకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించడంపై కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. బీజేపీపై పోరాటానికి సీనియర్ రాజకీయ నేత, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడను రంగంలోకి దింపుతున్నాయి.

ఈ పోరాటానికి నాయకత్వం వహించి అన్ని ప్రాంతీయ పార్టీలతో మాట్లాడాల్సిందిగా మా నాన్న ను కోరుతాను. బీజేపీ ప్రజాస్వామిక వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న తీరును ఆయన అందరి దృష్టికి తీసుకెళతారు. దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు మనమంతా కలిసి సాగాల్సిన అవసరముందని అని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. గురువారం నాడు ఆయన ఈ విషయాన్ని మీడియాకు వివరించారు.
బీజేపీ సాధారణ మెజారిటీ సాధించినప్పటికీ. యడ్యూరప్పకు ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చి గవర్నర్ వాజుభాయ్ వాలా అసంబద్ధంగా ప్రవర్తించారని కుమార స్వామి ఆరోపించారు. తన అధికారాన్నిగవర్నర్ దుర్వినియోగం చేశారని జేడీఎస్ నేత కుమారస్వామి మండిపడ్డారు. బీజేపీ ప్రలోభాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం తమ తక్షణ కర్తవ్యమని ఆయన చెప్పారు.
మా ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపైనే ప్రస్తుతం మేం దృష్టిపెట్టినట్లు ఆయన చెప్పారు. బీజేపీ, ఆ పార్టీ మంత్రులు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి ఎలా ఉందో ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. బీజేపీకి మెజారిటీ లేదు. అయినా గవర్నర్ ఇలా ఎందుకు ప్రవర్తించారు? ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని కుమారస్వామి మండిపడ్డారు.












Click it and Unblock the Notifications