గోవా ఎన్నికలు: బిజెపికి మాజీ నేత గండం
పనాజీ: గోవాలో లక్ష్మీకాంత్ పర్సెకర్ సారథ్యంలోని బిజెపి ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంగా మారిందని గోవా సురక్షా మంచ్ (జిఎస్ఎం) వ్యవస్థాపకుడు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) బహిష్కృత నేత సుభాష్ వెలింగ్కర్ (55) వ్యాఖ్యానించారు. ఏడాది క్రితం ఆర్ఎస్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన వెలింగ్కర్ ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన శివసేన, గోవా సర్కార్ మాజీ మిత్ర పక్షం మహారాష్ట్ర గోమంతక్ పార్టీ (ఎంజిపి)లతో కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. వచ్చేనెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
జిఎస్ఎం ముందు రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి బిజెపిని ఓడించడం, తర్వాత తమ కూటమిని అధికారంలోకి తేవడమేనని సుభాష్ వెలింగ్కర్ చెప్పారు. అవినీతితోపాటు వివిధ అంశాల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనన్నారు. గోవాలోని బిజెపి ప్రభుత్వం పూర్తిగా అవినీతి మయం అయిందని పేర్కొన్నారు. 2012లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సాగనంపినట్లే ఇప్పుడు బిజెపి ప్రభుత్వాన్ని సాగనంపడమే తమ లక్ష్యమని వెల్లింగ్కర్ అన్నారు. జిఎస్ఎం ఆరు స్థానాల్లో, శివసేన నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుంది. మిగతా 30 స్థానాల్లో ఎంజిపి పోటీ చేస్తుంది.
సంఘ్ సిద్ధాంతాలపై నమ్మకం ఉందని సుభాష్ వెల్లింగ్కర్ తెలిపారు. కానీ సంఘ్ నాయకత్వంపై సుదీర్ఘ కాలం నమ్మకం లేదన్నారు. రాజకీయ అధికారం ముందు మోకరిల్లిన సంఘ్ పరివార్.. తాను బిజెపిని వ్యతిరేకించగానే సంస్థ నుంచి బహిష్కరణకు గురైందన్నారు. దేశమంతా బిజెపికి వ్యతిరేక వాతావరణం నెలకొని ఉన్నదన్నారు.
2012 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏడాది ముందు అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియంలో ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలకు అనుమతి మంజూరుచేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నించిందని గుర్తుచేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తాము భారతీయ భాషా సురక్షా మంచ్ (బిబిఎస్ఎం) ఏర్పాటు చేశామని తెలిపారు.
బిబిఎస్ఎంకు రాజకీయ విభాగమే గోవా సురక్షా మంచ్ అని తెలిపారు. మరాఠీలకు, కొంకణి భాష మాట్లాడే వారి మధ్య దీర్ఘ కాలిక ఉద్యమం సాగిందని గుర్తుచేసిన వెల్లింగ్కర్.. తాము ఇంగ్లిష్ మీడియంకు వ్యతిరేకంగా పోరాడమన్నారు. తాము ఇంగ్లిష్ భాషకు వ్యతిరేకం కాదన్నారు. కేవలం ప్రైవేట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఇంగ్లిష్ మీడియం ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు అనుమతించడాన్ని మాత్రమే వ్యతిరేకించామన్నారు. దానికి బదులు ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఇంగ్లిష్ మీడియం అమలు చేయాలన్నది తమ విధానమన్నారు.
గోవా ఎన్నికల్లో కీలక పాత్రధారులు వీరే
మనోహర్ పారికర్ వారసుడిగా 2014 నుంచి సిఎంగా ఉన్న లక్ష్మీకాంత్ పర్సెకర్.. క్షేత్రస్థాయి నుంచి బిజెపిని బలోపేతం చేయడంలో మనోహర్ తోపాటు కీలకపాత్ర పోషించారు. లక్ష్మీకాంత్ పర్సెకర్కు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మాండ్రెం అసెంబ్లీ స్థానం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న పర్సెకర్ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి సారథ్యం వహిస్తున్నారు.
చిన్నతనం నుంచి పారికర్ ప్రభావిత నేత
చిన్నతనం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా పని చేసిన కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహారాష్ట్ర గోమంతక్ పార్టీ (ఎంజిపి)తో పోటీ పడేందుకే ఆయనను ఆర్ఎస్ఎస్ బిజెపిలోకి పంపింది. తద్వారా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రగతిశీల విధానాల అమలులోనూ, క్రమశిక్షణ గల నాయకుడిగా పేరొందారు. గోవా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు.
ఆప్ సిఎం అభ్యర్థి మాజీ ఐజీ గోమ్స్
గత ఏడాది స్వచ్ఛంద విరమణ పొందిన మాజీ ఐజీపి గోమ్స్ ప్రస్తుతం గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున సీఎం అభ్యర్థిగా బరిలో నిలిచారు. సౌత్ గోవాలోని కొంకులిం స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 19 నుంచి క్లీన్ ఇమేజ్, నిజాయితీతో కూడిన సుపరిపాలనను అందిస్తానని గోమ్స్ ప్రజలకు హామీనిస్తున్నారు.
మహా కూటమి నుంచి బరిలో సుదీన్
గోవా సురక్షా మంచ్, శివసేన, మహారాష్ట్ర గోమంతక్ పార్టీలతో కూడిన మహా కూటమి తరుఫున ఎంజిపి నేత సుదీన్ సీఎం అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఎంజిపి ఇటీవలి వరకు గోవాలో బిజెపితో కలిసి ప్రభుత్వంలో ఉంది. లక్ష్మీకాంత్ క్యాబినెట్ నుంచి ఇద్దరు మంత్రులను ఉపసంహరించుకున్న ఎంజిపి, జిఎస్ఎం, శివసేనలతో జట్టు కట్టింది.