మహిళా నేతకి బెదిరింపు, నా ఒంట్లో దేశభక్తి: రాహుల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, తాజాగా బిజెపి నేత నుపుర్ శర్మకు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో బెదిరింపులు వచ్చాయి.
జెఎన్యు వివాదం రోజురోజుకు ముదురుతోన్న విషయం తెలిసిందే. పార్లమెంటుపై దాడికి పథక రచన చేసిన అఫ్జల్ గురు ఉరితీతకు నిరసనగా జరిగిన ర్యాలీతో అక్కడ పెను వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ర్యాలీ తీసిన విద్యార్థులకు వ్యతిరేకంగా ఏబీవీపీ, అనుకూలంగా విపక్షాలు వకాల్తా పుచ్చుకున్నాయి.
ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలపై బిజెపి శ్రేణులు విరుచుకుపడుతుంటే, బిజెపి నేతలకు వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. బిజెపి మహిళా నేత, ఢిల్లీ వర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా పనిచేసిన ఏబీవీపీ మాజీ నేత నుపూర్ శర్మకు తాజాగా బెదిరింపులు వచ్చాయి.
జెఎన్యు ఘటనపై బుధవారం జరిగిన ఓ సమావేశంలో నుపూర్ శర్మ పాల్గొన్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆమె ట్విట్టర్ ఖాతాకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. 'గొంతు చించడం మానుకోండి. ఎవరో ఒకరు నీ గొంతు నరాలు తెగ్గోస్తారు. గుర్తుంచుకోండి' అని నుపూర్ను బెదిరించారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.
రాష్ట్రపతి భవన్కు జెఎన్యు వివాదం
జెఎన్యు వివాదం రాష్ట్రపతి భవన్కు చేరుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం పైన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఈ రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేయనున్నారు. జాతీయ సమగ్రతకు, జాతి వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా ఊరుకునేది లేదని బిజెపి చెబుతోంది. కొందరు జాతి వ్యతిరేకులుగా మారుతున్నారని ఏబీవీపీ మండిపడుతోంది.
నా రక్తంలోనే దేశభక్తి: రాహుల్ గాంధీ
మా రక్తంలోనే దేశభక్తి ఉందన్నారు. మా కుటుంబంలో దేశం కోసం మృతి చెందినవారు ఉన్నారన్నారు. తమ సిద్ధాంతాలను దేశంపై రుద్దేందుకు ఆరెస్సెస్ ప్రయత్నాలు చేస్తోందని ధ్వజమెత్తారు. జెఎన్యు పరిణామాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని చెప్పారు. కేంద్రం అనుసరిస్తున్న తీరు పైన తాము ఫిర్యాదు చేశామన్నారు. నా దేశభక్తిని ప్రశ్నించే హక్కు బిజెపికి లేదన్నారు. నాహృదయం, రక్తంలో దేశభక్తి ఉందన్నారు.