సీఎం బలపరీక్ష: బీజేపీ నాయకులు గాలం వేస్తున్నారని జేడీఎస్ ఎమ్మెల్యే కొడుకు, క్లారిటీ!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప మే 19వ తేదీ శనివారం 4 గంటల సమయంలో విదాన సౌధలో బలపరీక్ష నిరూపించుకుంటున్న సందర్బంలో బీజేపీ నాయకులు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులను ప్రలోభపెడుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
జేడీఎస్ ఎమ్మెల్యే
మైసూరు జిల్లా హణసూరు జేడీఎస్ శాసన సభ్యుడు హెచ్. విశ్వనాథ్ కు బీజేపీ నాయకులు ఫోన్ చేసి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారని ఆరోపణలు వచ్చాయి. జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్. విశ్వనాథ్ ఈ విషయంపై స్పందిస్తూ తనకు బీజేపీ నాయకులు ఎవ్వరూ ఫోన్ చెయ్యలేదని వివరణ ఇచ్చారు.
సోషల్ మీడియాలో పోస్టు
జేడీఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని ఎమ్మెల్యే హెచ్. విశ్వనాథ్ స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు పదేపదే ఫోన్లు చేసి తన తండ్రి హెచ్. విశ్వనాథ్ మద్దతు ఇవ్వాలని అడుతున్నారని, తనకు పదేపదే ఫోన్లు చేస్తున్నారని ఆయన కుమారుడు పూర్వజ్ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.
కాంగ్రెస్, జేడీఎస్ ప్రచారం
సీఎం యడ్యూరప్ప బలపరీక్ష నిరూపించుకోవడానికి సమయం దగ్గర పడుతుండటం, బీజేపీకి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేసే అవకాశం ఉందని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలలో ప్రచారం జరిగింది. ఈ సందర్బంలో జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్. విశ్వనాథ్ కు గాలం వేశారని స్వయంగా ఆయన కుమారుడే చెప్పడంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు.
సిద్దూ ఓటమిలో భాగం
సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హెచ్. విశ్వనాథ్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. సిద్దరామయ్య తీరుతో విసిగిపోయిన హెచ్. విశ్వనాథ్ కాంగ్రెస్ పార్టీకు గుడ్ బై చెప్పి జేడీఎస్ లో చేరారు. మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నియోజక వర్గంలో సిద్దరామయ్య ఓడిపోవడానికి హెచ్. విశ్వనాథ్ కూడా కారణం అయ్యారు.