బీజేపీ నేతల చెల్లెళ్లు, కూతుళ్లు వారిని పెళ్లాడాలి!: ఎస్పీ నేత
లక్నో: విశ్వహిందూ పరిషత్, ఇతర హిందుత్వ సంస్థలు చేపడుతున్న ఘర్ వాపసీ పైన సమాజ్వాది పార్టీ నేత శివపాల్ సింగ్ యాదవ్ ఓ ప్రశ్న లేవనెత్తారు. ఘర్ వాపసీ కార్యక్రమంలో భాగంగా మతం మార్చుకున్న వారికి బీజేపీ నేతలు తమ చెల్లెళ్లు, కూతుళ్లను ఇచ్చి వివాహం జరిపించాలని డిమాండ్ చేశారు.
సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన ఎన్నో హామీలను ఆ పార్టీ నేతలు విస్మరించారని ఆరోపించారు. ముస్లీం యువకులను వివాహం చేసుకున్న హిందూ అమ్మాయిలలో ఒక్కరినైనా వెనక్కి తెచ్చారా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.
సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీజేపీ ఇటువంటి కార్యక్రమాలను చేపడుతోందని ఆరోపించారు. నల్ల ధనాన్ని వెనక్కి తెచ్చి ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న బీజేపీ హామీ సంగతి ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశలో బీజేపీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని మండిపడ్డారు. శివపాల్ సింగ్ యాదవ్ ఆదివారం నాడు ఎస్పీ ఎమ్మెల్యే తేజ్ నారాయణ పాండే చిన్న సోదరుడి పెళ్లికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.