ముస్లింల కుట్ర ఇదీ: బిజెపి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
జైపూర్: రాజస్థాన్ అధికార బిజెపి శాసనసభ్యుడు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 2030నాటికి భారత్ను తాము స్వాధీనం చేసుకోవడానికి ముస్లింలు కుట్ర చేస్తున్నారని ఆల్వార్ బిజెపి శాసనసభ్యుడు బన్వరీలాల్ సింఘాల్ వ్యాఖ్యానించారు.
ఎక్కువ మంది పిల్లలను కనడం ద్వారా తమ జనాభాను హిందువుల జనాభాను మించిపోయే విధంగా చేసి భారతదేశాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని ముస్లింలు కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు.
జనవరి 29వ తేదీన ఆల్వార్ పార్లమెంటు సీటుకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఫేస్బుక్లో ఆ వ్యాఖ్య చేశారు. ముస్లింలు 12 నుంచి14 మంది పిల్లలను కంటున్నారని, హిందువులు ఒకరితోనూ ఇద్దరితోనూ సరిపెడుతున్నారని ఆయన అన్నారు.
ముస్లింల జనాభా పెరుగుతున్న కొద్దీ హిందువుల మనుగడ ప్రమాదంలో పడుతుందని ఆయన అన్నారు. రాష్ట్రపత, ప్రధాని, ముఖ్యమంత్రుల పదవులను హస్తగతం చేసుకోవడానికి అది పక్కాగా వేసిన పథకమని ఆయన అన్నారు. ముస్లింలు చట్టసభల్లో అధికారంలోకి వస్తే హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులవుతారని అన్నాు.
చాలా ఆలోచించిన తర్వాతనే తాను ఆ పోస్టు పెట్టానని, దాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని ఆయన పిటిఐ వార్తాసంస్థతో అన్నారు. భారతదేశంలో ముస్లిం జనాభా పెరుగుదలకు చెందిన వీడియో చూసిన తర్వాత తాను ఆ పోస్టు రాసినట్లు తెలిపారు.
ఒక్కొక్కరు 12 నుంచి 14 మంది పిల్లలను కని శాసనసభ, పార్లమెంటు నియోజకవర్గాల్లో 2030 నాటికి పాగా వేయాలని ముస్లింలు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. హిందువులు చెల్లించిన పన్నులను, ప్రభుత్వ వనరులను ముస్లింలు దోచుకుంటున్నారని ఆయన అన్నారు. కుటుంబం ఇద్దరు పిల్లలను మాత్రమే కనాలనే ఆంక్షలు పెట్టాలని ఆయన అన్నారు.