మమతా బెనర్జీ కోటలో బిజెపి ఖాతా: ఒక్క సీటు
న్యూఢిల్లీ: రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఎదురు దెబ్బ తిన్న బిజెపికి పశ్చిమ బెంగాల్ నుంచి సంతోషకరమైన వార్త అందింది. తృణమూల్ కాంగ్రెసు అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోట పశ్చిమ బెంగాల్లో బిజెపి ఖాతా తెరిచింది. ఉప ఎన్నికల్లో బషీర్హట్ దక్షిణ సీటును బిజెపి దక్కించుకుంది.
అయితే, తాను లక్ష్యం చేసుకున్న ప్రతిష్టాత్మకమైన కోల్కతాలోని చౌరింగీని మాత్రం బిజెపి దక్కించుకోలేకపోయింది. ఈ సీటును తృణమూల్ కాంగ్రెసు నిలబెట్టుకోవడం ఫలితం సాధించింది. శారదా కుంభకోణంలో మమతా బెనర్జీపై బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా తీవ్రంగా దాడి చేసిన క్రమంలోనే ఆ ఒక్క సీటు బిజెపి గెలుచుకోగలిగిందని అంటున్నారు.
బషీర్హట్ నియోజకవర్గంలో 2011 ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి నారాయణ్ ముఖోపాధ్యాయ గెలిచారు. ఆయన మరణంతో ఈ సీటుకు ఉప ఎన్నిక జరిగింది. ఈ రకంగా పశ్చిమ బెంగాల్లో సిపిఎం మరింతగా దెబ్బ తిన్నదని చెప్పవచ్చు.
పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలని చూస్తున్న బిజెపికి స్వల్ప మెజారిటీతోనైనా ఆ సీటును దక్కించుకోవడం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది కోల్కతా నగరపాలక సంస్థ ఎన్నికల్లో, 2016లో శాససభ ఎన్నికల్లో సత్తా చాటడానికి ఈ విజయం బిజెపికి నైతిక బలాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.
చౌరంగీ శాసనసభా స్థానంలో తృణమూల్ కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ నేత సుదీప్ బంధోపాధ్యాయ సతీమణి నయన బంధోపాధ్యాయ విజయం సాధించారు. ఆమె రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి రీతేష్ తివారీని ఓడించారు. 2011లో తృణమూల్ కాంగ్రెసు నుంచి విజయం సాధించిన సిఖా మిత్రా రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.