పిచ్చి వేషాలేయ్యొద్దు.. తలచుకొంటే తరిమికొడతాం.. మైనారిటీలపై బీజేపీ ఎమ్మెల్యే నోటి దురుసు
కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కాడు. బళ్లారిలో జరిగిన సభలో మాట్లాడుతూ మైనారిటీల మనోభావాలు దెబ్బ తినేలా వ్యాఖ్యలు చేశారు. దేశ జనాభాలో హిందువులు 80 శాతం, మైనారిటీలు 17 శాతమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేశంలో వేసే ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలని ఆయన హెచ్చరించారు. పౌరసత్వం సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న నిరసనకారులను హెచ్చరిస్తూ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎమ్మెల్యే ఇంకా ఏమన్నారంటే..

సీఏఏకు వ్యతిరేకంగా
ఎమ్మెల్యే ప్రసంగ వీడియోలో ఎమ్మెల్యే ప్రసంగంలో.. ఎవరైతే సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించే వారికి నేను ఓ హెచ్చరిక చేయదలచుకొన్నాను. మేము అధికారంలోకి వచ్చి ఐదు నెలలు మాత్రమే అయిందనే విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు తిక్క తిక్కగా.. పిచ్చి పిచ్చిగా వ్యవహరించి డ్రామాలు చేస్తే బాగుండదు. మేము తిరిగి గట్టిగా సమాధానం ఇస్తే మీ పరిస్థితి ఏమౌతుందో ఊహించుకోండి అని సోమశేఖర్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో అంతా ఇడియెట్స్
కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టకుండా బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలో ఇడియెట్స్ ఎక్కువగా ఉన్నారు. వారిని ప్రజలు విశ్వసించకూడదు. అలాంటి వారికి గట్టిగా సమాధానం ఇచ్చేందుకు ప్రజలు, కార్యకర్తలంతా వీధుల్లోకి రావాలి. మనం 80 శాతం ఉంటే వాళ్లు 18 శాతం ఉన్నారు. మనం గట్టిగా వారిని ఎదిరిస్తే వాళ్ల సంగతేంటి అని హెచ్చరించారు.

పాక్ ప్రధాని వ్యాఖ్యలతో
అంతేకాకుండా గతంలో పాకిస్థాన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి ఉదహరించారు. ఇది మా దేశం (పాకిస్థాన్). మీకు ఒకవేళ ఇక్కడ జీవించాలంటే.. మా రూల్స్ను పాటించాలి. లేకపోతే వెనక్కి పంపించేస్తాం అని పాక్ ప్రధాని అన్నారని, అలాంటి పరిస్థితే ఇక్కడ (భారత్) రాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.

బీజేపీ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ కేసు
ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ఆయన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెజారిటీ, మైనారిటీ అని విభజించి ద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని కాంగ్రెస్ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ పార్టీ వారిని కించపరిచే విధంగా బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

సోమశేఖరరెడ్డి రాజకీయంగా
ఇక సోమశేఖరరెడ్డి రాజకీయ, వ్యక్తిగత జీవితానికి వస్తే.. అటవీ భూముల్లో అక్రమ మైనింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే గతంలో తన సోదరుడి బెయిల్ కోసం ఏపీకి చెందిన న్యాయమూర్తికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications