40 ఇయర్స్ ఇండస్ట్రీ అవుట్: రాజకీయాలకు గుడ్బై
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నాయి.
బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తోన్నారు. ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గేకు ఇది సొంత రాష్ట్రం. ఫలితంగా ఈ ఎన్నికలను అటు కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మంగా తీసుకుంది. ఇప్పటివరకు వెలువడిన ఒపీనియన్ పోల్స్ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. ఈ పరిణామాల మధ్య బీజేపీ ఆత్మరక్షణలో పడినట్టే కనిపిస్తోంది.

తన అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇంకా విడుదల చేయకపోవడం దీనికి ఉదాహరణ. కాంగ్రెస్, జేడీఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ రెండు విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మూడో జాబితాపై కసరత్తు చేస్తోంది. అయినప్పటికీ- బీజేపీ మాత్రం తొలి జాబితాపైనే మల్లగుల్లాలు పడుతూ వస్తోంది. దీనిపై దేశ రాజధాని వేదికగా ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై భేటీ కూడా అయ్యారు.
అయినా- అభ్యర్థుల జాబితాను విడుదల చేయడానికి తటపటాయిస్తోంది. ఈ పరిణామాల మధ్య బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప- ఎన్నికల బరి నుంచి వైదొలిగారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు ఈశ్వరప్ప. అభ్యర్థుల ఎంపికలో తన పేరును పరిశీలించ వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఏ నియోజకవర్గానికి కూడా తన పేరును పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు. కర్ణాటక రాజకీయాల్లో 40 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది ఈశ్వరప్పకు. సాధారణ బూత్ స్థాయి కార్యకర్త నుంచి ఉప ముఖ్యమంత్రి హోదా వరకు ఎదిగారు. శివమొగ్గ నియోజకవర్గం నుంచి అయిదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ నియోజకవర్గాన్ని బీజేపీకి కంచుకోటగా మలిచారు. ఇప్పుడు కూడా ఆయనకే టికెట్ దక్కడం ఖాయమౌతుందనే వార్తలు వెలువడుతున్నాయి.
బీజేపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వస్తోన్నారాయన. మొన్నటి వరకు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. హఠాత్తుగా ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించడం చర్చనీయాంశమౌతోంది. కర్ణాటకలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్బై చెప్పారు. ఇప్పుడు అదే బాటలో ఆయన శిష్యుడి, బీజేపీలో నంబర్ టూగా ఉంటోన్న ఈశ్వరప్ప కూడా తప్పుకోవడం కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications