అసెంబ్లీలో క్యాండీ క్రష్ ఆడుతూ, ప్రియాంక ఫొటోలూ చూస్తూ ఎమ్మెల్యేలు
బెంగళూరు: కర్ణాటక శాసనసభలో సభ్యుల ప్రవర్తన మరోసారి బయటపడింది. బిజెపి శాసనసభ్యులు కొంత మంది తమ మొబైల్ ఫోన్స్లో శాసనసభలో క్యాండీ క్రష్ ఆడుతూ, ప్రియాంక చోప్రా చిత్రాలు చూస్తూ కెమెరాకు చిక్కారు. శాసనసభలో చెరుకు సంక్షోభంపై సీరియస్ చర్చ జరుగుతుండగా వారు ఆటవిడుపులో మునిగిపోయారు.
శాసనసభ్యుడు ప్రభు చవాన్ కాంగ్రెసు నాయకురాలు ప్రియాంక గాంధీ ఫొటో చూస్తూ, దాన్ని జూమ్ చేసి సహచర పార్టీ శాసనసభ్యుడు రవి సుబ్రహ్మణ్యకు చూపిస్తూ ఉన్న టీవి ఫుటేజీని కర్ణాటక టీవీ చానెల్స్ ప్రసారం చేశాయి. మరో ఎమ్మెల్యే యు.బి. బంకర్ క్యాండీ క్రష్ ఆడుతూ బిజీగా కనిపించారు.

చవాన్ తన మొబైల్ను చూస్తూ గ్యాలరీలో ఫొటోలను తిలకిస్తూ ఉన్న టీవీ ఫుటేజీ స్పష్టంగా కనిపించింది. గ్యాలరీలో ప్రియాంక గాంధీ ఫొటో కనిపించగానే చిత్రం కింది నినాదాన్ని చదవడానికి ఫొటోను జూమ్ చేస్తూ కనిపించారు. ప్రియాంక గాంధీ ఫొటో కింద కాప్షన్ను చూస్తూ ఉన్నానని, మొబైల్ ఫోన్ లోనికి తీసుకుని వెళ్లి తప్పు చేశానని, అందులో దురుద్దేశం లేదని, జాతీయ నాయకుల చిత్రాలను తాను చెక్ చేస్తున్నానని, నరేంద్ర మోడీ ఫొటో చూశానని, తన కుమారుడి ఫొటో కూడా చూశానని చవాన్ అన్నారు.
చిన్న సంఘటన కూడా మీడియాలో సంచలనంగా మారుతుందని, గత అసెంబ్లీ వారసత్వం తమకు ఉందని ఆయన అన్నారు. బిజెపి ప్రభుత్వ హయాంలో 2012లో ముగ్గురు మంత్రులు లక్ష్మణ్ సావడి, సిసి పాటిల్, కృష్ణ పలేమార్ క్లిప్స్ చూస్తూ టీవి కెమెరాకు చిక్కిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications