అరవింద్ కేజ్రీవాల్ను ఉగ్రవాదితో పోల్చిన బీజేపీ ఎంపీ.. వివాదాలకు కేరాఫ్గా పర్వేష్ వర్మ
న్యూఢిల్లీ: షాహీన్బాగ్లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టేవారు ఇళ్లల్లోకి ప్రవేశించి మహిళలు, కూతుళ్లపై అత్యాచారంకు తెగబడుతారనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ తాజాగా మరోసారి వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారారు. ఈ సారి ఏకంగా ఆమ్ ఆద్మీ అధినేత ఢిల్లీ సీఎం టార్గెట్గా కాంట్రవర్శీ స్టేట్మెంట్స్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఒక ఉగ్రవాదని వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో వేడిని పుట్టిస్తున్నాయి అధికార ప్రతిపక్ష పార్టీలు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీ నేతల మాటలకు అదుపులేకుండా పోతోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా పర్వేష్ సింగ్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నట్వర్లాళ్లతో పాటు అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఉగ్రవాదులు దాగి ఉన్నారని అన్నారు. కశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులతో పోరాడాలా లేక ఢిల్లీలోని కేజ్రవాల్ లాంటి ఉగ్రవాదులపై పోరాడాలా తనకు అర్థం కావడం లేదని అన్నారు.
షాహీన్ బాగ్లో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు మద్దతు తెలిపిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలపై ముందుకూడా విరుచుకుపడ్డారు పర్వేష్ సింగ్ వర్మ. షాహీన్బాగ్ నిరసనకారులకు మద్దుత తెలిపే కేజ్రీవాల్కు ఓటు వేస్తారా.. లేక అభివృద్ధి పథంలో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న బీజేపీకి ఓటువేస్తారా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. ఇదిలా ఉంటే షాహీన్బాగ్లో సీఏఏ నిరసనలపై విమర్శలు గుప్పించిన పర్వేష్ వర్మకు గుర్తు తెలియని వ్యక్తులనుంచి బెదిరింపు ఫోన్కాల్స్ వచ్చినట్లు సమాచారం.
షాహీన్బాగ్లో లక్షల మందితో సీఏఏపై నిరసన వ్యక్తం చేశారని అయితే దీని వెనక ఉండి నడిపించిందెవరో తెలియాలంటే విచారణ జరిపించాలని పర్వేష్ సింగ్ వర్మ డిమాండ్ చేశారు. సీఏఏ గురించి ప్రభుత్వం స్పష్టత ఇస్తున్నప్పటికీ కొందరు కావాలనే కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు పర్వేష్ సింగ్ వర్మ. పౌరసత్వ సవరణ చట్టంతో ఏ ఒక్క భారతీయుడు తన పౌరసత్వాన్ని పోగొట్టుకోడని భరోసా ఇచ్చారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఫిబ్రవరి 8వ తేదీన జరుగుతుండగా ఫిబ్రవరి 11వ తేదీన కౌంటింగ్ జరగనుంది.