బీజేపీ పరాజయం.. రైతు ఉద్యమ విజయమే: బీకేయూ నేత రాకేష్ టికాయత్
న్యూఢిల్లీ: హిమాచల్ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల పలితాలు వచ్చిన నేపథ్యంలో భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేష్ టికాయత్ స్పందించారు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ పరాజయం కావడం రైతుల ఉద్యమ విజయమేనని వ్యాఖ్యానించారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రాష్ట్రంలో రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.
హిమాచల్ప్రదేశ్, హర్యానాలో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైంది. తీవ్ర అసంతృప్తిలో ఉన్న ప్రజలు వారిని ఓడించారని రాకేష్ టికాయత్ చెప్పారు. ఇది తమ ఉద్యమ విజయమని ఆయన అభివర్ణించారు. రైతు ఉద్యమానికి మద్దతిస్తున్న ఇండియన్ నేషనల్ లోక్దళ్ నేత అభయ్ సింగ్ చౌతాలా విజయంతో ఇది మరోసారి రుజువైందన్నారు టికాయత్.

రైతు సమస్యలను ఇలాగే నిర్లక్ష్యం చేస్తే బీజేపీ ఇలాగే మూల్యం చెల్లించుకోక తప్పదని రాకేష్ టికాయత్ హెచ్చరించారు. బీజేపీ చేస్తున్న వాగ్ధానాలకు, చేస్తున్న పనులకు పొంతనలేదని దుయ్యబట్టారు. దేశ ప్రజలను అణచివేయాలని కోరుకుంటున్న కొందరు నేతలు బలమైన వ్యూహాలు రచిస్తున్నారని, దేశాన్ని అమ్మేయాలని చూస్తున్నారని రాకేష్ టికాయత్ ఆరోపించారు.
రోజు రోజుకు అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. కాగా, ఇటీవల దేశంలో జరిగిన పలు ఉపఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మంగళవారం వెలువడిన విషయం తెలిసిందే. అయితే, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. హర్యానాలో పోలింగ్ జరిగని ఒక స్థానంలో ఐఎన్ఎల్డీ గెలిచింది. బీజేపీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ లోక్సభ స్థానంలోనూ కాంగ్రెస్ గెలుపొందడం గమనార్హం. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోనూ రెండు సిట్టింగ్ స్థానాలను బీజేపీ కోల్పోయింది.












Click it and Unblock the Notifications