కర్ణాటక రిజల్ట్స్: బెంగుళూరులో కాంగ్రెస్ హవా, అనుహ్యంగా పుంజుకొన్న జెడి(ఎస్)
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో బిజెపి కంటే కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లను కైవసం చేసుకొంది. బెంగుళూరు సిటీలో జెడి (ఎస్) కూడ 7 సీట్లను గెలుచుకొంది. బెంగుళూరులో కాంగ్రెస్ పార్టీ పట్ల ఓటర్లు తమ ఆసక్తిని కనబర్చారని ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బెంగుళూరు పట్టణంలో సుమారు 28 అసెంబ్లీ సీట్లున్నాయి. అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీ 16 సీట్లను కైవసం చేసుకోవడం గమనార్హం. బిజెపికి 11 సీట్లు మాత్రమే దక్కాయి. అయితే 2013 లో జరిగిన ఎన్నికల్లో పట్టణ ప్రాంతంలో బిజెపి 12 స్థానాలను కైవసం చేసుకొంది.
పట్టణ ప్రాంత ఓటింగ్ లో పెద్దగా మార్పు ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ, అందుకు భిన్నంగా ఈ దఫా జెడి(ఎస్) అనుహ్యాంగా పుంజుకోవడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.
2013లో బెంగుళూరు నగరంలో జెడి(ఎస్) కేవలం మూడు అసెంబ్లీ సీట్లను మాత్రమే కైవసం చేసుకొంది. కానీ, ఈ దఫా ఎన్నికల్లో గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవడం విశేషం.
2008లో బెంగుళూరు సిటీలో సుమారు 17 అసెంబ్లీ సీట్లను బిజెపి కైవసం చేసుకొంది. ఈ దఫా కూడ అదే తరహ ఎక్కువ సీట్లను బిజెపి దక్కించుకొంటుందని రాజకీయ పరిశీలకులు భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జెడి(ఎస్) పుంజుకొంది. బిజెపి కంటే కాంగ్రెస్ పార్టీ నగరంలో ఎక్కువ సీట్లను గెలుచుకోవడం ఆసక్తిగా మారింది.
బెంగుళూరు పట్టణ ఓటర్లను దృష్టిలో ఉంచుకొని బిజెపి తన మ్యానిఫెస్టోలో పలు అంశాలను పొందుపర్చింది. 24 గంటల విద్యుత్తు సరఫరా, మంచినీటి సరఫరా చేస్తామని హమీ ఇచ్చింది. కానీ ఓటర్లు ఎందుకో బిజెపి పట్ల పెద్దగా మొగ్గు చూపలేదని ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి.