21వ శతాబ్దంలోనూ అలాంటి రాజకీయాలా?: హనుమాన్ చాలీసా పఠిస్తే అవహేళన చేశారు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నవేళ.. ఆ పార్టీ అధినేత, ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సరళిని తప్పు పట్టారు. ఢిల్లీ ఓటర్లను ఆకర్షించడానికి మత రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, దళితులు.. ఇలా కులాలు, మతాలవారీగా ఓటర్లను విభజించడానికి ప్రయత్నించిందని విమర్శించారు. శనివారం ఆయన ఓ జాతీయ న్యూస్ ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు
ఉగ్రవాది ముద్ర.. హిందూ వ్యతిరేకిగా చిత్రీకరణ..
ఎన్నికల ప్రచార సమయంలో కొందరు బీజేపీ నాయకులు ఎంత దూకుడుగా వ్యవహరించారనేది అందరికీ తెలిసిన విషయమే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అత్యంత వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తోన్న వారి గుండెల్లో బుల్లెట్లు దించాలని పిలపునిచ్చారు. అదే సమయంలో- బీజేపీ లోక్సభ సభ్యుడు పర్వేష్ కుమార్ వర్మ సైతం వెనక్కి తగ్గలేదు. అరవింద్ కేజ్రీవాల్ను ఉగ్రవాదితో పోల్చారు.
ఆ వ్యాఖ్యలే ప్రభావం చూపాయంటూ..
ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ నాయకులు వ్యవహరించిన తీరుతో ఢిల్లీ ప్రజలు విసుగెత్తిపోయారని కేజ్రీవాల్ అన్నారు. వేలెత్తి చూపడానికి ఎలాంటి సమస్యలు లేకపోవడం వల్లే బీజేపీ నాయకులు మత రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తనను ఉగ్రవాదిగా, దేశద్రోహిగా, హిందూ వ్యతిరేకిగా ముద్ర వేయడానికి ప్రయత్నించారని అన్నారు. ఆ ప్రయత్నాలను ప్రజలు గుర్తు పెట్టుకున్నారని, కుట్ర రాజకీయాలను తిప్పి కొట్టారని చెప్పారు.
హనుమాన్ చాలీసాను పఠిస్తే.. అవహేళన చేశారు..
ఎన్నికల ప్రచార సమయంలో ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమానికి అరవింద్ కేజ్రీవాల్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నారు. తాను ఆంజనేయుడికి కఠోర భక్తుడినని చెప్పుకొన్నారు. హనుమాన్ చాలీసాను పఠించి, వినిపించారు. దీనిపై బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకునే కేజ్రీవాల్.. హనుమంతుడి భక్తుడిగా చెప్పుకొంటున్నారని అన్నారు. తనపై బీజేపీ నాయకులు చేసిన ఇలాంటి విమర్శలన్నీ ఆ పార్టీ ఓటమికి దారి తీశాయనే విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయని కేజ్రీవాల్ తెలిపారు.
21వ శతాబ్దంలో కూడానా..
బీజేపీ అనుసరించే కుల, మతతత్వ రాజకీయాలకు 21వ శతాబ్దంలో తావు లేదని కేజ్రీవాల్ చెప్పారు. సర్వ మానవ సమానత్వాన్ని స్వాగతించాల్సిన ప్రస్తుత పరిస్థితులు, ఈ ఆధునిక కాలంలో బీజేపీ నాయకులు తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లనే ధోరణితో.. హిందువుల ఓటు బ్యాంకు కోసమే పని చేస్తున్నారని, దాని ఫలితాలు భవిష్యత్తులో ఘోరంగా ఉంటాయని కేజ్రీవాల్ చెప్పారు. తన ఎన్నికల ప్రచార సరళిని, వ్యూహాలను బీజేపీ తిరిగి రాసుకోక తప్పదని హితబోధ చేశారు