NPR, NRCపై పార్టీల సోషల్ వార్.. రాహుల్, చిదంబరానికి మాల్వియా పంచ్
సీఏఏ.. ఎన్ఆర్సీ.. ఎన్ పీఆర్.. డిటెన్షన్ సెంటర్లు.. దేశంలో ఏ ఇద్దరు కలిసినా వీటిపైనే చర్చ. ఈ నాలుగు అంశాల చుట్టూ చెలరేగిన ఆందోళనలతో.. ఆరేండ్లలో తొలిసారి మోడీ సర్కార్ మెడలు వంచగలిగామని అపోజిషన్ పార్టీలు సంబరపడ్డాయి. కానీ అంతలోనే బీజేపీ గోడకు కొట్టిన బంతిలా రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. డిటెన్షన్ సెంటర్లపై మాట్లాడిన రాహుల్ గాంధీకి, ఎన్ పీఆర్ ప్రస్తావన తెచ్చిన పి.చిదంబరానికి బీజేపీ ఐటీ సెల్ ఇన్ చార్జి అమిత్ మాల్వియా అదిరిపోయే రేంజ్ లో పంచ్ లు విసిరారు.
జార్ఖండ్ ఎఫెక్ట్?: బీజేపీ సంకీర్ణ కూటమి సర్కార్ లో లుకలుకలు: మిత్రపక్షంలో తిరుగుబాటు: రాజీనామా..!
అబద్ధం.. ఎన్నిసార్లు చెప్పినా అబద్ధమే
దేశంలో డిటెన్షన్ సెంటర్లపై ప్రధాని మోదీని కౌంటర్ చేయబోయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అమిత్ మాల్వియా అడ్డంగా దొరకబుచ్చుకున్నారు. ఈ వివాదాన్ని మొదలుపెట్టింది కూడా రాహులే. గత ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ప్రధాని మాట్లలాడుతూ.. ‘‘దేశంలో ముస్లింలను ఉంచడానికే కేంద్రం డిటెన్షన్ సెంట్లర్లు నిర్మిస్తోందనే వాదన పచ్చి అబద్ధం''అని చెప్పారు. దీనిపై గురువారం రాహుల్ గాంధీ ఓ పోస్ట్ పెట్టారు. మోడీని ఆర్ఎస్ఎస్ ప్రధానిగా అభివర్ణిస్తూ.. ‘‘అపోజిషన్ పార్టీలు అబద్ధాలాడుతున్నాయని ప్రధాని మోడీ చెప్పారు. నిజానికి ఆయనవే అబద్ధాలు. డిటెన్షన్ సెంటర్లు కడుతున్నారనడానికి ఇంతకంటే ఆధారం కావాలా?'' అంటూ కర్నాటకలో డిటెన్షన్ సెంటర్ నిర్మాణానికి సంంధించిన వీడియోను జతచేశారు.
ఏం రాహుల్.. ఓడిపోతే ఇంతగా దిగజారాలా?
అయితే ఇదేమంత కొత్త విషయంకాదని, దేశంలో అక్రమంగా నివసించే విదేశీయులను గుర్తించి, వాళ్లను డిటెన్షన్ సెంటర్లకు పంపడం అన్ని ప్రభుత్వాలు చేసేదేనని మాల్వియా వాదనకు దిగారు. 2011లో 362 మంది అక్రమవలసదారుల్ని డిటెన్షన్ క్యాంపునకు తరలించే విషయమై అప్పటి కేంద్ర హోం శాఖ.. అస్సాం ప్రభుత్వానికి రాసిన లేఖను మాల్వియా బయటపెట్టారు. ‘‘ఏం రాహుల్ గాంధీ.. ప్రజలు మిమ్మల్ని పదే పదే తిరస్కరించినంతమాత్రాన ఇంతగా దిగజారాలా? విద్వేష రాజకీయాలతో ప్రజల్లో లేనిపోని భయాలు కల్పించే పనికి పనుకోవాలా?''అని మాల్వియా ప్రశ్నించారు.
ఎన్ పీఆర్ ఐడియా మీదేగా..
నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్ పీఆర్)ను తప్పుపట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరాన్ని మాల్వియా ఇరుకునపెట్టారు. 2008 ముంబై దాడుల తర్వాత చిదంబరం కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారని, ఆయన ఆధ్వర్యంలోనే ఎన్ పీఆర్ సేకరణ జరిగిందని మాల్వియా గుర్తుచేశారు. ‘‘ఎన్ఆర్సీ కోసమే ఎన్ పీఆర్ ను తెస్తున్నాం''అని చిదంబరం మాట్లాడిన పాత వీడియోనూ బీజేపీ విడుదల చేసింది. దీనిపై చిదంబరం స్పందిస్తూ.. ‘‘ఎన్ పీఆర్ ను కాంగ్రెసే తెచ్చిందంటున్నారుగా.. మరి మా డ్రాఫ్టును మీరెందుకు ఫాలోకావడంలేదు?''అని ప్రశ్నించారు. అందుకు మాల్వియా.. ‘‘కాంగ్రెస్ రూల్స్ లో ఎన్ పీఆర్ కు నేరుగా ఎన్ ఆర్సీతో సంబంధమున్నట్లు పేర్కొన్నారు. ఆ రెండిటికి మధ్య లింకును తెంచేసింది బీజేపీనే‘‘అని పంచ్ విసిరారు.
వాజపేయి జమానాలోనే బీజం పడింది..
బీజేపీ ఇప్పుడు అమలు చేయాలనుకుంటున్న దేశవ్యాప్త ఎన్ ఆర్సీ ప్రక్రియకు వాజపేయి జమానాలోనే బీజం పడిందని కాంగ్రెస్ ఎంపీ పి.చిదంబరం చెప్పుకొచ్చారు. అప్పటి డ్రాఫ్టు చాలా ప్రమాదకరంగా ఉందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దానికి సవరణలు చేసిందని గుర్తుచేశారు. మొత్తానికి సీఏఏ.. ఎన్ఆర్సీ.. ఎన్ పీఆర్.. డిటెన్షన్ సెంటర్లపై పార్టీల మధ్య సోషల్ వార్ తారాస్థాయికి చేరింది.