సీమాంధ్రలో చేరికలు, టి క్రెడిట్: బిజెపి డబుల్ గేమ్?
న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుకు సంపూర్ణ మద్దతిస్తామంటూ నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్న భారతీయ జనతా పార్టీలో అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంటులో బిల్లును ప్రతిపాదించే సమయం దగ్గర పడుతున్నకొద్దీ కమలనాథుల శిబిరంలో చీలికలు కనిపిస్తున్నాయి. సీమాంధ్రకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు గత కొద్దిరోజులుగా విభజనపై వ్యక్తం చేసిన అభిప్రాయాలపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
బిల్లును మనమే అడుకుంటున్నామన్న వ్యతిరేక సంకేతం ప్రజల్లోకి వెళ్లిందని కొంతమంది సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు వెంకయ్యపై పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్కు ఫిర్యాదు చేశారు. సీమాంధ్రకు చెందిన వెంకయ్య వర్గం తెలంగాణ నేతలపై రాజ్నాథ్కు ప్రతి ఫిర్యాదు చేసింది. తెలంగాణను సమర్థిస్తున్నామన్న మాటలకు, పార్టీలోని వాస్తవ పరిణామాలకు పొంతన కుదరటం లేదు.
తెలంగాణ కలను సాకారం చేయడానికి సహకరించాల్సిందిగా బిజెపి అగ్రనేతలైన అద్వానీ, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీలను కలసిన తెలంగాణ టిడిపి నేతలకు చేదు అనుభవం ఎదురైంది. బిజెపి అగ్రనాయకత్వం వ్యక్తం చేసిన అభిప్రాయాలు తమకు తీవ్ర నిరాశ కలిగించాయని టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. అద్వానీ తన సుదీర్గ ప్రజా జీవితంలో ఇంతవరకూ ఇంత అస్తవ్యస్థమైన విభజన ప్రక్రియ చూడలేదని వ్యాఖ్యానించారన్నారు.
బిల్లులోని లోపాలను ఎవరైనా సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కథ కంచికి చేరడమేనని తేల్చి చెప్పారంటున్నారు. ఉమ్మడి రాజధాని ప్రస్తావన రాజ్యాంగంలో ఎక్కడా లేదంటూనే, హైదరాబాద్ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న ప్రతిపాదన ఎలా ఆచరణ సాధ్యమో అంతుచిక్కడం లేదంటూ అద్వానీ వ్యక్తం చేసిన అభిప్రాయం తెలంగాణవాదులను కలవరపెడుతోంది.
లోక్సభ విపక్షనేత సుష్మ తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తూ, రాజ్యాంగ సవరణ లేకుండా సాధ్యపడని అనేక అంశాలను ఖాతరు చేయకుండా ప్రభుత్వం రూపొందించిన బిల్లు చట్టరూపం ధరించినప్పటికీ న్యాయపరమైన సమస్యలు తప్పకపోవచ్చని చెప్పారు. అయితే బిల్లును కాంగ్రెస్ ప్రతిపాదించగలిగితే పూర్తిగా సమర్ధించి తీరుతామని అంటున్నారు.
అరుణ్ జైట్లీ బిల్లులోని లోపాలను తెలియచేసి, బిల్లును సవాలు చేసే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. బిజెపి అగ్రనేతలు లెవనెత్తిన అనుమానాలతో తెలంగాణ తెదేపా నేతలు ఖంగుతిన్నారట. బిజెపి వైఖరి మారుతోందా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
బిల్లును ప్రవేశపెట్టే స్థితిలోనే కాక, సొంత శిబిరాన్నే అదుపుచేయలేక పోతున్నందున బిల్లు వస్తే తప్ప ఇతరత్రా తాము నిస్సహాయులమని చేతులు దులుపుకునే ప్రమాదం ఉందా? అని బిజెపిని శంకిస్తున్నారు. టిటిడిపి అనుమానాలు బయటపెట్టగానే తెలంగాణ బిజెపి నేతలు హుటాహుటిన సుష్మా స్వరాజ్ నివాసానికి వెళ్లి సుదీర్ఘంగా చర్చించారు. తమ పార్టీ బయటకొకమాట లోపలొక మాట చేప్పదని, తెలంగాణ బిల్లును సమర్థించే విషయంలో వెనక్కి తగ్గేది లేదని బండారు దత్తాత్రేయ, చెన్నమనేని విద్యాసాగర్ రావు వివరించారు.
కొంతమంది పనిగట్టుకుని బిజెపిపై దుష్ప్రచారానికి పాలుపడుతున్నారని ఆరోపించారు. ఇదిలావుంటే, పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు మంగళవారం కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్కు సిగ్గుంటే బిల్లును ఆమోదింప చేసుకోవాలని సవాలు చేశారు. సొంత ఇంటిని చక్కదిద్దుకుని, ప్రత్యర్థులపై బురదజల్లే పనులు మానుకోవాలని హితవు పలికారు.
కాగా, బిల్లంతా లోపాల పుట్ట అని అద్వానీ, సీమాంధ్రుల ఆశలు నెరవేర్చుతూ తెలంగాణ ఇవ్వాలని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ కాంగ్రెసు ఖాతాలో పడకుండా ఉండేందుకు, సీమాంధ్రలో పలువురు నేతలు పార్టీలో చేరుతుండటం కారణంగా బిజెపి ఆచితూచి స్పందిస్తోందని కొందరు, డబుల్ గేమ్ ఆడుతోందని కొందరు అంటున్నారు.