దేశాన్ని మతాలవారీగా విభజించడానికే పౌరసత్వ సవరణ: ముఖ్యమంత్రి
ముంబై: దేశాన్ని మతాలవారీగా విభజించడానికే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. అన్ని భాషలు, మతాలు, కులాలవారు నివసిస్తోన్న భారత్ను హిందూ దేశంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలను తిప్పికొట్టడానికి ప్రతి భారతీయుడూ సంసిద్ధుడై ఉండాలని చెప్పారు.
ఆదివారం ముంబైలో ఏర్పాటైన కలెక్టివ్ ముంబై కార్యక్రమానికి పినరయి విజయన్ హాజరయ్యారు. ఇదివరకు బ్రిటీష్ పాలకులు అనుసరించిన విభజించి, పాలించు అనే ఫార్ములాను బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తోందని ధ్వజమెత్తారు. భారత్ను ముస్లిం రహిత దేశంగా మార్చడానికే పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. ఏ ఒక్క రాష్ట్రం కూడా ఈ చట్టాన్ని అమలు చేయకూడదని తాను కోరుకుంటున్నానని అన్నారు.

సంఘ్ పరివార్ ద్వారా హిందూయిజాన్ని విస్తృతం చేయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. మత రహితం, సర్వమానవ సమానత్వాన్ని కలిగి ఉండటమే భారతదేశ మూల సిద్ధాంతమని, ఆ సిద్ధాంతాల పునాదుల మీదే ప్రజాస్వామ్యం నిర్మితమైందని పినరయి విజయన్ అన్నారు. అలాంటి పునాదులను పెకిలించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయకూడదంటూ తీర్మానించిన తొలి ప్రభుత్వం తనదేనని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications