మాకు ఎదురులేదు, 350కిపైగా సీట్లలో గెలుస్తాం, అదే మా ధీమా: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
లక్నో: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయితే, అధికార బీజేపీ మాత్రం తమ విజయం ఖాయమని చెబుతోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి భారీ విజయం నమోదు చేస్తామని, తమ అధికారం కొనసాగుతుందని అంటోంది.

350కిపైగా సీట్లు పక్కా: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 350కిపైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల కోసం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. తమ పార్టీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

ప్రియాంక ఎలక్షన్ టూరిజం, అఖిలేష్ ప్రయత్నాలు పనిచేయవు
ప్రతిపక్షంలో ఉన్న అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇక ప్రియాంక గాంధీ వాద్రా 'ఎలక్షన్ టూరిజం'.. కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం సాయం చేయలేదని ఎద్దేవా చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. 2017 ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్ కళ్యాణ్ సంకల్ప్ పత్రలో ఇచ్చిన హామీలన్నీ తమ ప్రభుత్వం నెరవేర్చిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు బీజేపీ వెంటే ఉన్నారని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు గానూ 350కిపైగా సీట్లను తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

అభివృద్ధికి చిరునామాగా యూపీ: సీఎం యోగి ఆదిత్యనాథ్
2017కు ముందు ఉత్తరప్రదేశ్ను బీమారు స్టేట్ అని అనేవారని.. ఇప్పుడు మాత్రం అభివృద్ధికి చిరునామాగా చెప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. రాష్ట్రంలోని 24 కోట్ల ప్రజల అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. తాము చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయన్నారు. అదే తమ ధీమా అని వ్యాఖ్యానించారు.
Recommended Video

భారత అభివృద్ధిలో యూపీనే కీలకం: యోగి ఆదిత్యనాథ్
రాష్ట్రంలో రైతులు, మహిళలు, పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. 2017 నుంచి తాము రైతుల రుణాలను మాఫీ చేశామన్నారు. రూ. 36వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేయడం ద్వారా 21 మిలియన్ల మంది రైతులకు మేలు చేశామన్నారు. భారత్ ఒక గ్లోబల్ ఎకనామిక్ సూపర్ కావడంలో ఉత్తరప్రదేశ్ కీలకంగా మారుతోందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. కాగా, ఓపీనియన్ పోల్స్ కూడా బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, గతంలో సాధించిన సీట్ల కంటే తక్కువగా సీట్లు వస్తాయని పేర్కొన్నాయి. అఖిలేష్ యాదవ్ పార్టీ నుంచి కొంత పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపాయి. ఇక, కాంగ్రెస్ పార్టీ సింగిల్ సీటుకే పరిమితం అవుతుందని పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications