మోడీ భోపాల్ సభకు రూ.5: హాజరుకానున్న అద్వానీ
భోపాల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ సభకు గత నెలలో ఐదు రూపాయలు తీసుకున్నట్లుగా మధ్యప్రదేశ్ భోపాల్ సభకు కూడా కార్యకర్తల నుండి రుసుము వసూలు చేయాలని బిజెపి నిర్ణయించింది.
అయితే, ఈ డబ్బును సభకు వచ్చిన ప్రజలందరి నుండి కాకుండా కార్యకర్తల నుండి మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించారు. సభకు సాధారణ ప్రజలు ఉచితంగానే రావొచ్చునని తెలిపారు. ఈ సభను ప్రధానంగా బిజెపి కార్యకర్తల కోసమే నిర్వహిస్తున్నారు.
బిజెపి పూర్వరూపమైన జనసంఘ్ అగ్రనేత పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని కార్యకర్త మహాకుంభ్ పేరుతో ఈ సభ జరుపుతున్నారు. దీనికి ఏడు లక్షల మంది కార్యకర్తలు హాజరు కావొచ్చునని అంచనా వేస్తున్నారు. భోపాల్లో నరేంద్ర మోడి సభ వచ్చే వారంలో జరగనుంది.
స్టేజ్ పైన మోడీతో అద్వానీ
ఈ సభలో పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ కూడా పాల్గొననున్నారు. మోడీ, అద్వానీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు వేదికను పంచుకోనున్నారు. కాగా, ఇటీవలి వరకు మోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై అద్వానీ అసంతృప్తితో ఉన్నప్పటికీ నాలుగు రోజుల క్రితం అలకవీడి కితాబిచ్చిన విషయం తెలిసిందే.