బీజేపీకి అంత సీన్ లేదు... అంతా ఈసీ వల్లే... లేదంటే 50 సీట్లు కూడా దాటకపోయేది : మమతా బెనర్జీ
బెంగాల్ గడ్డపై తృణమూల్ కాంగ్రెస్ హ్యాట్రిక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బెంగాల్లో ఈసారి అధికారి తమదేనని చాలా ధీమాగా ప్రకటించుకున్న బీజేపీ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. అయితే 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 స్థానాలకు పరిమితమైన ఆ పార్టీ ఇప్పుడు 80 స్థానాలకు చేరుకోవడం చిన్న విషయమేమీ కాదు. భవిష్యత్తులో బెంగాల్ గడ్డపై జెండా పాతేందుకు 80 మంది ఎమ్మెల్యేల బలం బీజేపీకి బిగ్ బూస్టింగ్ అనడంలో సందేహం లేదు. అయితే తాజా ఎన్నికల్లో బీజేపీ ఈ స్థాయిలో సీట్లు సాధించడానికి ఎన్నికల సంఘమే కారణమని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు.
బీజేపీకి ఈసీ సహకరించకపోయి ఉంటే...
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరించిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఒకవేళ ఈసీ గనుక బీజేపీకి సహకరించి ఉండకపోతే... ఆ పార్టీ 50 సీట్లు కూడా దాటి ఉండకపోయేది అన్నారు. ఈ ఎన్నికల్లో ఈసీ వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ టీఎంసీ సొంతంగా డబుల్ సెంచరీ సీట్లు దాటిందని పేర్కొన్నారు. ఇంకా కొన్నిచోట్ల ఈవీఎం మెషీన్లను ట్యాంపరింగ్ చేశారని... మరికొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్లను కూడా రద్దు చేశారని ఆరోపించారు. ఏదేమైనప్పటికీ బెంగాల్ ప్రజల తీర్పుకు తాను సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. ఈ తీర్పు బెంగాల్ ప్రజలనే కాదు... దేశం మొత్తాన్ని కాపాడిందన్నారు.
నందిగ్రాంలో రీకౌంటింగ్కి డిమాండ్...
నందిగ్రాంలో ఓటమిపై స్పందిస్తూ.. 'ఇది ఓటమి కాదు... అక్కడ ట్యాంపరింగ్ జరిగింది.. అందుకే రీకౌంటింగ్ నిర్వహించాలని కోరుతున్నాం... పోలింగ్ రోజు పోలింగ్ బూత్ ఎదుట నన్ను 3 గంటల పాటు నిరీక్షించేలా చేశారు... ఆ సమయంలో ఎవరినీ ఓటు వేసేందుకు అనుమతించలేదు... ఇప్పటికైతే దీనిపై రీకౌంటింగ్ డిమాండ్ చేస్తున్నాం... అక్కడ పోస్టల్ బ్యాలెట్,వీవీప్యాట్ ఓట్లను మళ్లీ లెక్కించాలి... ఎందుకంటే బీజేపీ మాఫియా గ్యాంగ్ అక్కడ చాలా అక్రమాలు,అవకతవకలకు పాల్పడింది. ప్రజలకు నిజాలు తెలియాలి...' అని చెప్పుకొచ్చారు.నందిగ్రాంలో ఓటమిపై తనకేమీ బాధ లేదని మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్రంలో టీఎంసీ గెలిచిన స్థానాలన్నీ తనవేనని అన్నారు. ఈసారి నందిగ్రాంలో పోటీ చేసి రిస్క్ చేశానని... ఎన్నికల కమిషన్,స్థానిక అధికారులు తనను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.
జాతీయ రాజకీయాల్లోకి వస్తారా...
'మనమంతా స్ట్రీట్ ఫైటర్స్... అందుకే టీఎంసీ గెలిచింది...' అంటూ బెంగాల్ ప్రజలు,టీఎంసీ శ్రేణులను ఉద్దేశించి మమత పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో మహిళలు,యువత పెద్ద ఎత్తున తమకు ఓటు వేశారని చెప్పారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో మమతా జాతీయ నాయకురాలిగా ఎదుగుతారా అన్న ప్రశ్నకు...'అది నిర్ణయించడానికి నేనెవరిని... నా పని నేను చేసుకుంటూ వెళ్తాను... నేనేమీ అంత ముఖ్యమైన వ్యక్తిని కాను... విపక్ష పార్టీల్లోని నా మిత్రులతో కలిసి మాట్లాడుతాను... వాళ్లేం అడుగుతారో అందుకు నేను పూర్తిగా సహకరిస్తాను...' అని స్పష్టం చేశారు. కాగా,మొత్తం 292 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన బెంగాల్లో టీఎంసీ 213 స్థానాల్లో గెలుపొంది బీజేపీపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 147 మార్క్ను సునాయాసంగా చేరుకుంది.