నల్లధనం: 16వ స్థానంలో భారత్, నిబంధనలు పాటించని స్విస్ బ్యాంక్
న్యూఢిల్లీ: నల్ల కుబేరులకు సంబంధించి మరో జాబితా వెలుగు చూసింది. ప్రపంచవ్యాప్తంగా లక్షమందికి పైగా ఖాతాదారుల వివరాలు దీనిలో ఉండటం సంచలనం సృష్టించింది. స్విట్జర్లాండులోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో ఉన్న ఈ కాతాల వివరాలను అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల వేదిక (ఐసీఐజే) బయటపెట్టింది. ఇది భారత్లో మరో రాజకీయ దుమారం సృష్టించవచ్చునంటున్నారు.
లక్షమంది దాచుకున్న మొత్తం సంపద సుమారు ఆరు లక్షల కోట్లు ఉంటుందని అంచనా. జాబితాలో భారత్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు, మాజీ అధికారుల పేర్లు ఉన్నాయని అంటున్నారు. తాజా జాబితాలో వెల్లడైన నేపథ్యంలో సోమవారం స్పందించిన విషయం తెలిసిందే.
హెచ్ఎస్బీసీ స్విట్జర్లాండు శాఖ, ఇతర చోట్ల ఉన్న భారతీయుల అప్రకటిత ఖాతాల పేర్లను పొందేందుకు ప్రజావేగుతో సంప్రదింపులు సాగిస్తున్నట్లు కేంద్రం చెప్పింది. కొత్త కేసులన్నింటి పైనా తాము దర్యాఫ్తు జరుపుతామన్నారు. జాబితాలో ఉన్నవారంతా అక్రమార్కులు రాని, వారిలో కొందరు తమ విదేశీ వ్యాపారా లావాదేవీల వివరాలను ఇప్పటికే పన్ను అధికారులకు తెలియజేశారని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.
జాబితాలో 1195 మంది భారతీయుల పేర్లు ఉన్నాయి. ఆ ఖాతాల్లోని నిల్వలు రూ.25,420 కోట్లుగా ఉంటాయని భావిస్తున్నారు. నల్లధన కుబేరుల జాబితాలో భారత్ స్థానం 16. టాప్ టెన్లో... స్విట్జర్లాండ్, బ్రిటన్, వెనెజులా, అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, ఇటలీ, బ్రెజిల్, బహమాస్, బెల్జియంలు ఉన్నాయి. కుబేరుల సంఖ్యాపరంగా చూస్తే భారత్ 1668 మందితో 18వ స్థానంలో ఉంది.
కాగా, బ్యాంకు ఖాతాలు తెరవడం, నిర్వహించండపై ఇటీవల ఏళ్లలో కఠినమైన ప్రమాణాలు పాటిస్తున్నామని, గతంలో మాత్రం కొన్ని లోపాలు చోటు చేసుకున్నాయని హెచ్ఎస్బీసీ బ్యాంకు అంగీకరించింది. నల్లధనం, పన్ను ఎగవేతల పైన తాజా జాబితా వెల్లడైన నేపథ్యంలో యూ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న హెచ్ఎస్బీసీ బ్యాంకు పైవిధంగా స్పందించింది.