సల్మాన్ లాగే.. కృష్ణ జింకల కేసులో హైదరాబాదీ డాక్టర్: ఇలా అడ్డంగా బుక్కయ్యాడు
హైదరాబాద్: కృష్ణజింకల వేటలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్కు జోద్పూర్ కోర్టు ఐదేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ చర్చ ఇలా తెరపై ఉండగానే మరో కృష్ణజింకల వేట కేసు తెరపైకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన డెంటిస్ట్ డా.ముజాహిద్ కృష్ణ జింకలను వేటాడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
Recommended Video
కృష్ణ జింకల కేసు: సల్మాన్ ఖాన్కు బెయిల్ మంజూరు, రూ.50వేల పూచీకత్తు
వృత్తిరీత్యా డెంటిస్ట్ అయిన ముజాహిద్.. దుబాయ్లో నివాసముంటున్నాడు. ఇటీవలే హైదరాబాద్ వచ్చాడు. నగరానికి వచ్చినప్పుడల్లా.. స్నేహితులతో కలసి బీదర్ వెళ్లడం ఇతనికి అలవాటు. ఆ క్రమంలోనే స్నేహితులు సయ్యద్ అజర్, యాకూబ్లతో కలసి గత నెల 29న కర్ణాటకలోని బీదర్ వెళ్లారు.
బీదర్ వెళ్లాక.. హుమ్నాబాద్కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి నుంచి కృష్ణ జింకల సమాచారం సేకరించాడు. ఆపై హల్సూర్ గ్రామానికి చేరుకుని.. రాత్రంతా అక్కడే మాటువేశారు. ఈ క్రమంలో మూడు జింకల్ని వారు వేటాడారు. మరుసటిరోజు బీదర్ నుంచి హైదరాబాద్ తిరిగి వస్తున్న క్రమంలో.. బసవకల్యాణ్ పోలీసులు వీరిని పట్టుకున్నారు.
పట్టుబడ్డ సమయంలో జీపులో జింకల మాంసంతోపాటు చర్మం, విదేశాల్లో తయారైన 0.22 క్యాలిబర్ రైఫిల్, తూటాలు, ఆరు కత్తులు లభించాయి. దీంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసకున్నారు. వీరికి సహకరించిన శ్రీకాంత్ అనే వ్యక్తిని హుమ్నాబాద్ లో పట్టుకున్నారు.
వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద సెక్షన్ 9,51ల ప్రకారం వీరిపై కేసులు నమోదు చేశారు. కేసును శనివారం బీదర్ అటవీ అధికారులకు బదిలీ చేశారు. గతంలోనూ రెండుసార్లు ఈ ముఠా కృష్ణజింకల్ని వేటాడానికి యత్నించినట్టు గుర్తించారు.