మణిపూర్కు అడ్డంకి దిగ్బంధం
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన సమస్యగా 80 రోజుల జాతీయ రహదారుల దిగ్బంధం మారుతోంది. 60 అసెంబ్లీ స్థానాలు గల మణిపూర్ రాష్ట్రంలో సగం నియోజకవర్గాల పరిధిలో ‘జాతీయ రహదారి దిగ్బంధం’ ప్రభావం చూపుతున్నది.
న్యూఢిల్లీ: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన సమస్యగా 80 రోజుల జాతీయ రహదారుల దిగ్బంధం మారుతోంది. 60 అసెంబ్లీ స్థానాలు గల మణిపూర్ రాష్ట్రంలో సగం నియోజకవర్గాల పరిధిలో 'జాతీయ రహదారి దిగ్బంధం' ప్రభావం చూపుతున్నది. ఈ తరుణంలో మణిపూర్ రాష్ట్రంలోని రెండో నంబర్ జాతీయ రహదారిపై దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందు ఉన్న అవకాశాలు పరిమితం. యునైటెడ్ నాగాలాండ్ కౌన్సిల్ (యుఎన్సి) తీవ్రవాదులు చేపట్టిన ఆందోళనను ఎదుర్కొనేందుకు రాష్ట్రపతి పాలన విధించి ఎన్నికల ప్రక్రియ చేపట్టేందుకు కేంద్రం వెనుకాడుతున్నది. దీనికి కారణం శాంతిభద్రతల అంశం రాష్ట్రానికి చెందిన అంశం కావడంతో చేష్టలుడిగి వ్యవహరిస్తోంది.
'ఈ జాతీయ రహదారి ప్రత్యక్షంగా, పరోక్షంగా కనీసం 30 అసెంబ్లీ స్థానాల మీదుగా సాగుతుంది. ఇప్పుడు జాతీయ రహదారుల దిగ్బంధనం కారణంగా పార్టీల ప్రచారం, పోలింగ్ అధికారుల రవాణా, ఇవిఎంలు, ఇతర లాజిస్టిక్స్ పరికరాలను రవాణా కష్టంగా మారుతున్నది' అని సీనియర్ హోంశాఖ అధికారి ఒకరు చెప్పారు. మణిపూర్ లో వచ్చేనెల 4, 8 తేదీల్లో రెండు విడతలుగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల నిర్వహణ బాధ్యత ఎన్నికల సంఘానిదేనని కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
మరోవైపు జాతీయ రహదారి దిగ్బంధం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటే రీతిలో ఫలుకుతుండటం కేంద్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, రఓణ మంత్రి మనోహర్ పారికర్, ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ, హోంశాఖ అధికారులు ఇటీవల సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. సమావేశానికి హాజరైన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ స్పందిస్తూ జాతీయ రహదారుల పరిరక్షణ కేంద్రం, శాంతిభద్రతల అంశం రాష్ట్రం అంశం అని వివరణ ఇచ్చారు.
అయినప్పటికీ కేంద్రం.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సుమారు 17,500 మంది పారా మిలిటరీ బలగాలను మణిపూర్ కు పంపింది. వాటిలో నాలుగు వేల మంది గత పది రోజుల్లోనే పంపింది. పారా మిలిటరీ బలగాలు అందుబాటులో ఉన్నా.. దిగ్బంధం కొనసాగుతుండటంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతూనే ఉన్నారు.
దిగ్బంధ నివారణకు కాంగ్రెస్, బిజెపిల యత్నం
పది రోజుల క్రితం దిగ్బంధం నివారణ మార్గాలపై ఈశాన్య రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ నేతలు మేథోమథనం చేశారు. 15 ఏళ్లుగా కొనసాగుతున్న ఇబోబిసింగ్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ప్రభావానికి తోడు దిగ్బందం కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుపరిపాలన సాధన కోసం ఇబోబిసింగ్ కొత్త జిల్లాలను కూడా ఏర్పాటుచేశారని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి సిపి జోషి చెప్పారు. దీన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం అనుకూలంగా మార్చుకోబోమని కూడా అన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతిని తాము అర్థంచేసుకోగలమని యుఎన్ సి ప్రధాన కార్యదర్శి ఎస్ మిలాన్ చెప్పారు. కానీ మణిపూర్ రాష్ట్రంలో నివసిస్తున్న నాగాల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఇంత జరుగుతున్నా కేంద్రంలోని అధికార బిజెపి జాతీయ కార్యవర్గం మాత్రం అసలు సమస్యల పరిష్కారం సంగతి అటుంచి దిగ్బంధ రహిత సుపరిపాలనను అందిస్తామని మణిపూర్ వాసులకు హామీలు గుప్పిస్తోంది. యుఎన్ సి, నాగా తీవ్రవాదులు చేస్తున్న పని తప్పని, రాష్ట్ర ప్రజలు కనీస అవసరాలు, వైద్య, ఆరోగ్య సర్వీసులు అందుబాటులో లేక పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని నార్త్ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్ కన్వీనర్, బిజెపి నేత హేమంత బిశ్వా శర్మ వ్యాఖ్యానించారు. నాగా తీవ్రవాదుల ఆందోళన ప్రజాస్వామిక మార్గం కాదన్నారు.