బెంగళూరులో ఫ్లైఓవర్ ఎక్కుతున్న సిటీ బస్సు పల్టీ, 8 మంది పరిస్థితి విషమం, 23 మందికి గాయాలు !
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం ఆద్వర్యంలో బెంగళూరు నగరంలో సంచరిస్తున్న బీఎంటీసీ బస్సు ఫ్లైఓవర్ ఎక్కుతున్న సమయంలో అదుపుతప్పి పల్టీకొట్టడంతో 23 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలైనాయి. వారిలో 8 మంది ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
బుధవారం బెంగళూరు నగరంలోని రాజాజీనగర్ 1వ బ్లాక్ లో వెలుతున్న బీఎంటీసీ బస్సు ఫ్లైఓవర్ ఎక్కుతున్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి సర్వీసు రోడ్డులోకి పల్టీ కొట్టింది. ఆ సందర్బంలో బీఎంటీసీ బస్సులో ఉన్న ప్రయాణికులు ఒకరి మీద ఒకరు పడిపోవడంతో తొక్కిసలాట జరిగింది.
విషయం గుర్తించిన స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు బీఎంటీసీ బస్సులో ఉన్న ప్రయాణికులను బయటకు లాగడానికి ప్రయత్నించారు. అతి కష్టం మీద బస్సులో ఉన్న 23 మందిని బయటకు లాగారు. 23 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
గాయపడిన వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బెంగళూరు నగరంలో నిత్యం బీఎంటీసీ బస్సులు ప్రమాదాలకు గురికావడంతో వాటిలో సంచరించడానికి ప్రయాణికులు హడలిపోతున్నారు.