టికెట్ లేకుండా రైలు ఎక్కారా ? నో ప్రాబ్లమ్ అంటున్న రైల్వే .. కాకుంటే చిన్న ట్విస్ట్ !!
ఇండియన్ రైల్వేస్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రైల్వే ప్రయాణికులు స్టేషన్ లో టికెట్ తీసుకునే సమయంలో క్యూ లైన్ లో నిలబడే కష్టాలు ఉండకుండా సరికొత్త నిర్ణయం తీసుకుంది. టికెట్ తీసుకునే క్రమంలో తలెత్తే ఇబ్బందులకు పరిష్కారం చూపుతూ ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
కరోనా నుండి ఉపశమనం పొందుతున్న భారత్ .. 8 లక్షలకు తగ్గిన యాక్టివ్ కేసులు
ఆ టికెట్ ఉంటే గమ్య స్థానానికి టికెట్ లేకున్నా రైలు ఎక్కొచ్చు
ఇండియన్ రైల్వేస్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకనుండి ఎవరైనా టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కినా భయపడాల్సిన అవసరం లేదు. కాకుంటే ఈ క్రమంలో ఓ చిన్న ట్విస్ట్ కూడా పెట్టారు రైల్వే అధికారులు. రైలు ఎక్కడానికి కేవలం ప్లాట్ ఫామ్ టికెట్ ఉంటే చాలని , ఆ తర్వాత ఆ టికెట్ ను టీటీఈకి చూపించి ప్రయాణికులు వెళ్లవలసిన స్టేషన్ వరకు టికెట్ తీసుకోవచ్చని రైల్వే శాఖ తెలిపింది. అయితే ప్లాట్ ఫామ్ టికెట్ కొనాల్సిందే కదా అని ఆలోచిస్తున్న ప్రయాణికులకు క్యూలో నిలబడి కొనాల్సిన అవసరం లేదంటూ పేర్కొంది.
రైల్లోనే టికెట్ తీసుకునే సౌకర్యం
ప్లాట్ ఫామ్ టికెట్ ను యు టి సి యాప్ ద్వారా లేదా రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేస్తున్న వెండింగ్ మిషన్ ద్వారా తీసుకోవచ్చని, దీంతో వివిధ కారణాలతో ఆలస్యంగా స్టేషన్ కు వచ్చిన ప్రయాణికులు రైలు సమయం దగ్గర పడుతోంది అని, క్యూలో నిల్చుని టికెట్లు కొనాలని టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, డైరెక్టుగా రైలెక్కి రైల్లోనే టికెట్ తీసుకోవచ్చని రైల్వే శాఖ వెల్లడించింది. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం టికెట్లు దొరక్క, బెర్త్ ఉందో లేదో తెలియక ప్రయాణాలు వాయిదా వేసుకునే వారికి ఓ రకంగా శుభవార్తే అని చెప్పాలి.
రైల్లో నుండి ఆన్ లైన్ ద్వారా కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చు
ప్లాట్ ఫామ్ టికెట్ తో రైలెక్కిన వారు ట్రైన్ లో ప్రయాణం చేస్తూనే ఆన్లైన్ ద్వారా కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చని కూడా రైల్వే శాఖ వెల్లడించింది. ఇక టికెట్ లేకుండా రైలెక్కితే జరిమానాలు విధించే విధానానికి స్వస్తి పడినట్లే అని భావిస్తే తప్పే అవుతుంది. ఎందుకంటే రైలెక్కిన వారు గమ్యస్థానానికి టిక్కెట్ కొనుగోలు చేయకుంటే ఖచ్చితంగా ప్లాట్ ఫామ్ టికెట్ ను విధిగా చూపించాల్సి ఉంటుంది. అలా చూపించుకుంటే కచ్చితంగా జరిమానాలు విధిస్తారు.
ప్రయాణికుల సౌకర్యం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న రైల్వే , వర్కవుట్ అవుతుందా ?
ఇప్పటికే రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే స్టేషన్ లలో వైఫై సౌకర్యం కల్పిస్తుంది. అలాగే ప్రయాణీకుల మోత బరువు కష్టాలు తీర్చటానికి బ్యాగ్ ఆన్ వీల్స్ సేవలు మొదలుపెట్టింది. అలాగే మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తుంది . ఏదేమైనప్పటికీ రైల్వేశాఖ తీసుకున్న తాజా కొత్త నిర్ణయం ప్రయాణికులకు కాసింత టెన్షన్ తగ్గిస్తూ ఉండగా ఈ కొత్త నిర్ణయం ఏ మేరకు వర్కవుట్ అవుతుంది అనేది వేచి చూడాల్సిందే.