బ్యాంకు మేనేజర్, అకౌంటెంట్ కిడ్నాప్: రూ. 20 లక్షల డిమాండ్
జమాయి: బీహార్ రాష్ట్రంలో కిడ్నాపర్లు రెచ్చిపోయారు. ఏకంగా ఓ జాతీయ బ్యాంకు మేనేజర్ తోపాటు అకౌంటెంట్ను కిడ్నాప్ చేశారు. ఈ ఘటన జమాయి జిల్లాలో చోటు చేసుకుంది. వారిని విడిచిపెట్టాలంటే రూ. 20 లక్షలు చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా ఆ అధికారులు కిడ్నాప్కు గురయ్యారు. అయితే సదరు అధికారుల కుటుంబసభ్యులు మాత్రం ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు.
కిడ్నాపర్ల బెదిరింపుల కారణంగా వారి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయలేదని పోలీసులు భావిస్తున్నారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న ఆ ఇద్దరు అధికారులను రాజ్ల కెనరా బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ ఓం ప్రకాశ్ పాశ్వాన్, రంజిత్ కుమార్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పాశ్వాన్కు సంబంధించిన ద్విచక్ర వాహనాన్ని శాటిఘాట్ ప్రాంతంలో గుర్తించినట్లు చెప్పారు.
అయితే కిడ్నాప్ చేసింది మావోయిస్టులా లేక నేరస్తులా అనేది తేలాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కిడ్నాప్ చేసిన దుండగులను పట్టుకునేందుకు ఇప్పటికే తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. అతి త్వరలో నిందితులను పట్టుకుని, అధికారులను క్షేమంగా తీసుకొస్తామని చెప్పారు.