టాయిలెట్తో సెల్ఫీ! అవుతుందిక పెళ్లి!! వధువుకు కానుకగా రూ.51వేలు కూడా
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన కొత్త పథకం ప్రకారం.. తన ఇంట్లో కట్టుకున్న మరుగుదొడ్డి వద్ద సెల్ఫీ దిగితేనే ఆ యువకుడికి పెళ్లి జరుగుతుంది. లేదంటే అంతే సంగతులు. అయితే, తమ ఇంట్లోని మరుగుదొడ్డి వద్ద సెల్ఫీ దిగి అధికారులకు ఆ ఫొటో ఇస్తే.. అతని వివాహానికి గ్రీన్ సిగ్నల్ పడ్డట్లే.
మరుగుదొడ్డి నిర్మాణం: కోర్కె తీర్చాలని అధికారి లైంగిక వేధింపులు, బాధితురాలిలా..
కొత్త పథకం..
అంతేగాక, ఆ యువకుడు తన ఇంట్లోని మరుగుదొడ్డి వద్ద దిగిన ఫొటోను సంబంధిత అధికారులు అప్పగించిన అనంతరం అతను పెళ్లి చేసుకునే అమ్మాయికి ముఖ్యమంత్రి కన్యా వివాహ్/నిఖా యోజన పథకం కింద రూ. 51వేలను ప్రభుత్వం అందజేస్తుంది.
ప్రతి ఇంట్లోనూ..
మహిళలకు వివాహం తర్వాత బహిర్భూమికి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తకుండా ఉండేందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
నవ వధువుకు రూ. 51వేలు
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన యువతులకు పెళ్లి సమయంలో రూ. 51వేల నగదు ఇవ్వడం కూడా ఈ పథకం ఉద్దేశంలో భాగమే. పెళ్లి కొడుకు ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలి.. ఆ టాయిలెట్ వద్ద వరుడు సెల్ఫీ తీసి అధికారులకు పంపాలి. పెళ్లి కొడుకు ఇంట్లో టాయిలెట్ ఉందని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అఫిడవిట్ దాఖలు చేయాలి. దీనికి సెల్ఫీ విత్ టాయిలెట్ ఫొటోను కూడా జతచేయాలి. ఇక అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత అధికారులు ప్రభుత్వం అందించే రూ. 51వేలను నవ వధువుకు అందించడం జరుగుతుంది.
పక్కదోవ పట్టొద్దంటూ..
కాగా, మరుగుదొడ్డి వద్ద తీసుకున్న సెల్ఫీని చూసే ఈ పథకాన్ని వర్తింపజేయడం సరికాదని కొందరు యువకులు అంటున్నారు. అధికారులు ఇంటికి వచ్చి పరిశీలించడం లేదని చెబుతున్నారు. దీంతో ఏదో ఒక టాయిలెట్ వద్ద సెల్ఫీ తీసుకుని కూడా అధికారులకు దాఖలకు చేయవచ్చని, ఇలా చేయడం వల్ల పథకం దుర్వినియోగం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రతి దరఖాస్తుదారుడి ఇంట్లో మరుగుదొడ్డి ఉందో లేదో అధికారులు స్వయంగా వచ్చి పరిశీలిస్తేనే పథకానికి పూర్తి న్యాయం జరుగుతుందని అంటున్నారు. మంచి పథకాన్ని సక్రమంగా అమలు చేస్తేనే ఫలితం ఉంటుందని చెబుతున్నారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ పథకంలో రాష్ట్రంలో అమలవుతోంది.