దేశాన్ని నిలువునా చీల్చిన వేళ.. భారత్ నడిబొడ్డున 4,000 కిలోమీటర్ల గోడ!
భారత స్వాతంత్య్ర పోరాటంలో 'ఉప్పు' ఎంతటి కీలక పాత్ర పోషించిందో మనందరికీ తెలుసు. మహాత్మా గాంధీ చేపట్టిన దండి మార్చ్ సమర శంఖారావంగా చరిత్రలో నిలిచిపోయింది. అయితే, అంతకంటే ముందే, నిరుపేదల నోటికాడ కూడుపై ఉప్పు పన్ను పేరిట ఈస్టిండియా కంపెనీ సాగించిన దౌర్జన్యం గురించి వింటే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది.
భారతీయుల రక్తమాంసాలను పిండుకోవడానికి, దేశాన్ని రెండుగా విభజిస్తూ బ్రిటిష్ పాలకులు ఏకంగా 4,000 కిలోమీటర్ల పొడవునా ఒక భారీ ముళ్ల అడవిని పెంచి, ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన 'జీవ గోడ'ను నిర్మించారంటే నమ్మడం కష్టం. కానీ ఇది అక్షరాలా నిజం!
భారత్ను నిలువునా చీల్చిన 'ముళ్ల కంచె'!
19వ శతాబ్దం మధ్యకాలంలో, వేర్వేరు ప్రాంతాల్లో ఉప్పుపై వేర్వేరు పన్నులు విధించిన తెల్లదొరలు, తక్కువ పన్ను ఉండే ప్రాంతాల నుంచి ఎక్కువ పన్ను ఉండే ప్రాంతాలకు ఉప్పు రవాణా కాకుండా అడ్డుకోవాలనుకున్నారు. ఇందుకోసం 1843లో 'ఇన్లాండ్ కస్టమ్స్ లైన్' పేరిట పంజాబ్లోని ముల్తాన్ నుంచి ఒడిశాలోని బంగాళాఖాతం తీరం వరకు దాదాపు 2,500 మైళ్ల (4,000 కి.మీ.) మేర దట్టమైన జీవ ముళ్ల గోడను నిర్మించారు.

లండన్ నుంచి ఇస్తాంబుల్ మధ్య ఉన్నంత దూరంతో సమానమైన ఈ కంచె కోసం బబూల్, రేగు, కరండ, కలబంద వంటి పదునైన ముళ్ల చెట్లను నాటారు. ఇది 12 అడుగుల ఎత్తు, 14 అడుగుల వెడల్పుతో ఎంత దట్టంగా ఉండేదంటే.. మనుషులు కాదు కదా, కనీసం క్రూర మృగాలు కూడా దీని గుండా అటుఇటు దాటలేకపోయేవి!
పేదల పేగులు ఎండబెట్టిన 'ఉప్పు రాబందులు'
ఎండలు మండే మన దేశంలో ఉప్పు అనేది ఆర్భాటం కాదు, ప్రాణాధార అవసరం. కానీ, తెల్ల పాలకులకు మాత్రం అది భారీ ఆదాయ వనరుగా మారింది. ఈ ముళ్ల గోడను పటిష్టంగా కాపాడటానికి, స్మగ్లింగ్ను అరికట్టడానికి ఏకంగా 12,000 మంది సిబ్బందిని, 1,700కి పైగా కస్టమ్స్ పోస్టులను ఏర్పాటు చేశారు.
దయ్యాలు ఏలినట్లున్న ఈ వ్యవస్థ నిర్వహణ కోసం నాటి బ్రిటిష్ అధికారి, ఆ తర్వాత కాంగ్రెస్ వ్యవస్థాపకుడిగా మారిన అల్లాన్ ఆక్టేవియన్ హ్యూమ్ ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ చెట్లను పెంచడం విశేషం. కేవలం ఒక్క ఏడాదే (1869-70) ఉప్పు పన్ను రూపంలో మన దేశస్థుల నుంచి ఏకంగా రూ.1.25 కోట్లను గుంజారంటే, ఆ దోపిడీ తీవ్రత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. నాణ్యమైన ఉప్పు అందక, పన్ను కట్టలేక లక్షలాది మంది పేదలు అనారోగ్యం పాలై, కరువు రోజుల్లో ప్రాణాలు కోల్పోయారు.
ఇంత పెద్ద చరిత్ర ఎలా మాయమైంది?
చివరకు ఉప్పు పన్నును దేశమంతటా సమానం చేయడంతో పాటు, సంభార్ లేక్ వంటి ప్రధాన ఉప్పు తయారీ కేంద్రాలు నేరుగా బ్రిటిష్ కంట్రోల్లోకి రావడంతో 1879లో ఈ క్రూరమైన 'ఇన్లాండ్ కస్టమ్స్ లైన్'ను రద్దు చేశారు. నిర్వహణ భారంగా మారడం, కంచె ఎండిపోవడంతో కాలక్రమేణా గ్రామస్థులు ఆ చెట్లను నరికేయగా, ఈ మహా గోడ ఆనవాళ్లు లేకుండా పోయాయి.
1995లో రాయ్ మోక్సమ్ అనే లండన్ పరిశోధకుడు పాత పత్రాలను తిరగేస్తుండగా ఈ విస్తుపోయే నిజం బయటపడింది. ఆయన భారతదేశంలో ఏళ్ల తరబడి పర్యటించి, ఉత్తరప్రదేశ్లోని ఎటావా ప్రాంతంలో మిగిలి ఉన్న కొద్దిపాటి ఆనవాళ్లను గుర్తించి 'ది గ్రేట్ హెడ్జ్ ఆఫ్ ఇండియా' అనే పుస్తకాన్ని రాశారు. మన దేశ స్వాతంత్య్ర పోరాటం వెనుక నిరుపేదలపై జరిగిన ఇటువంటి మౌన పోరాటాలు, తెల్లదొరల ఆర్థిక దోపిడీ ఘాతుకాలు ఎన్నో ఉన్నాయి!














Click it and Unblock the Notifications