యడ్డీకీ బల పరీక్షే: 29 లేదా 31న విశ్వాస తీర్మానం?
బెంగళూరు: కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడింది భారతీయ జనతాపార్టీ. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షడు, ప్రతిపక్ష నేత బీఎస్ యడ్డియూరప్ప ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కుదిరింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బెంగళూరులోని రాజ్భవన్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమైంది. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్డియూరప్ప ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగో సారి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో- గవర్నర్ వజూభాయ్ వాలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీని ఆహ్వానించారు. ఆ పార్టీ అధినేతగా యడ్డియూరప్ప ముఖ్యమంత్రి పగ్గాలను అందుకోబోతున్నారు.
ఆషాఢమాసం చివరి శుక్రవారం..చాముండి అమ్మవారి ఆశీర్వాదం: అందుకే హడావుడి ప్రమాణం!
ఇల్లు అలకగానే పండగ కాదన్నట్టు.. ప్రమాణ స్వీకారం చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్న యడ్డియూరప్ప అగ్నిపరీక్షను ఎదుర్కొనబోతున్నారు. ఈ నెల 29 లేదా 31వ తేదీన సభలో ఆయన తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. బొటాబొటి మెజారిటీ అంటే- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కర్ణాటక శాసనసభలో 103 మంది సభ్యుల బలం కావాల్సి ఉండగా.. బీజేపీకి 105 మంది ఉన్నారు. అంటే ఇద్దరు సభ్యులు మాత్రమే అధికం. అదే సమయంలో కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమికి 99 మంది సభ్యుల బలం ఉంది. స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ను కూడా కలుపుకొంటే ఈ బలం 100కు చేరుతుంది. సీట్ ఎడ్జ్ తరహాలో ఈ రెండు పార్టీలకు సంఖ్యాబలం ఉంది. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా.. ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం నెలకొని ఉంది.
ఇలాంటి సున్నితమైన పరిస్థితుల మధ్య యడ్డియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రెండు లేదా మూడు రోజుల వ్యవధిలో ఆయన శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 29 లేదా 31వ తేదీన ఆయన బలపరీక్షను నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో బీఎస్ యడ్డియూరప్ప బలపరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అనంతరం ఓటింగ్ నిర్వహిస్తారు. 103కి పైగా సభ్యుల బలం ఉంటేనే యడ్డియూరప్ప ప్రభుత్వం మనుగడ కొనసాగించగలుగుతుంది. మైనారిటీలో పడిందంటే మాత్రం పరిస్థితులు ఎదురు తిరుగుతాయి. మధ్యంతర ఎన్నికలకు దారి తీసే అవకాశం ఏర్పడుతుంది.