ఇంత జరుగుతున్నా మారని పాక్: చొరబాటుదారుడి ఫినిష్
India Pakistan War: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో కిందటి నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి ప్రతీకారానికి దిగింది భారత్. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను పెంచిపోషిస్తోన్న పాకిస్తాన్పై మిస్సైళ్లతో దాడి చేసింది.
పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగాలపై పాతుకుపోయిన ఉగ్రవాద సంస్థలను నామరూపాల్లేకుండా చేసింది భారత్. ఈ దాడిలో జైషె మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలు భారీగా నష్టపోయాయి. అవి నిర్వహిస్తోన్న శిబిరాలు ధ్వంసం అయ్యాయి.

అదే సమయంలో పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఒంటరి చేసే ప్రయత్నాలను చేపట్టింది కేంద్రం. ఈ దాడుల గురించి అన్ని మిత్ర దేశాలకు సమాచారం ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. పాకిస్తాన్ భూభాగంతో పాటు పాక్ ఆక్రమిత్ కాశ్మీర్పై ఎందుకు మిస్సైళ్ల దాడి చేయాల్సి వచ్చిందనే విషయాన్ని వివరిస్తోంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఏకాకి చేసే ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది.
అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతర్, తజకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్ప్.. వంటి దేశాలతో సంప్రదింపులు జరిపింది. తాజాగా ఐక్యరాజ్యసమితితోనూ మాట్లాడింది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఐరాస భద్రత మండలికి ఈ దాడులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందజేసింది.
ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ బుద్ధి మారట్లేదు. చొరబాటును ప్రోత్సహిస్తూనే వస్తోంది. చొరబాటుదారులకు బాటలు పరుస్తూనే ఉంది. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి వేల సంఖ్యలో బీఎస్ఎఫ్ బలగాలు మోహరించి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ చొరబాటుదారులు భారత్లో అక్రమంగా అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.
తాజాగా పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దులను దాటుకుని భారత్లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించాడో పాక్ చొరబాటుదారుడు. అతన్ని బీఎస్ఎఫ్ బలగాలు కాల్చి చంపాయి. బుధ- గురు అర్ధరాత్రి వేళ ఈ ఘటన చోొటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్లో నిఘా ముమ్మరం కావడంతో పంజాబ్ వైపు నుంచి అతను భారత్లో చొరబడేందుకు ప్రయత్నించాడు.
చీకటిని ఆసరగా చేసుకుని.. పాకిస్తాన్ చొరబాటుదారుడు అంతర్జాతీయ సరిహద్దును ఉద్దేశపూరకంగా దాటడానికి ప్రయత్నించాడని బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దు భద్రతా కంచె వైపు కదులుతున్నట్లు నిర్ధారణ కావడంతో బీఎస్ఎఫ్ బలగాలు అతన్ని మట్టుబెట్టినట్లు పేర్కొన్నాయి. ఈ ఉదయం అతని మృతదేహాన్ని పోలీసులకు అప్పగించినట్లు వివరించాయి.












Click it and Unblock the Notifications