బరితెగింపు: భారత్ గగనతలంలో పాక్ విమానం
జమ్మూ: పాకిస్థాన్ మళ్లీ భారత్ ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నదని వెలుగు చూసింది. నియమాలు ఉల్లంఘించి పాకిస్థాన్ కు చెందిన విమానం ఒకటి భారత గగనతలంలోకి వచ్చిందని తెలుస్తోంది.
జమ్మూలోని ఆర్ఎస్ పుర ప్రాంతంలో తక్కువ ఎత్తులో ఎగురుతున్న పాకిస్థాన్ విమానం కనపడిందని భారత సరిహద్దు భ్రదతా దళం (బీఎస్ఎఫ్) చెప్పింది. మద్యాహ్నం 1.15 గంటల సమయంలో విమానం వచ్చిందని బీఎస్ఎఫ్ గుర్తించింది.
భారత గగనతలంలోకి వచ్చిన ఆ విమానం కొన్ని నిమిషాల్లో మళ్లీ తిరిగి వెళ్లిందని బీఎస్ఎఫ్ చెప్పింది. సిల్వర్ రంగులో ఆరు రెక్కలు ఉన్న ఆ విమానం వచ్చిందని జవాను ఢిల్లీలోని బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయానికి సమాచారం ఇచ్చారు.
పాకిస్థాన్ విమానం భారత గగనతలంలోకి వచ్చిందా ? లేదా ? అని తెలుసుకోవాలని వాయుసేనను బీఎస్ఎఫ్ కోరింది. భారత గగనతలంలోకి అనుమానాస్పద విమానం వచ్చినట్లు తమ రాడార్స్ గుర్తించలేదని వాయుసేన స్పష్టం చేసింది.