భగ్గుమంటోన్న బీఎస్పీ : దయాశంకర్ నాలుక కోస్తే 50 లక్షలంటూ ప్రకటన
ఛండీగడ్ : వేశ్య కంటే దారుణమంటూ.. బీఎస్పీ అధినేత్రి మాయావతిని కించపరిచేలా తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ పై బీఎస్పీ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేసిన బీఎస్పీ కార్యకర్తలు.. దయాశంకర్ సింగ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
దయాశంకర్ సింగ్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. తాజాగా చంఢీగడ్ బీఎస్పీ అధ్యక్షురాలు జన్నత్ జహాన్ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 'దయాశంకర్ నాలుకను కోసి తెచ్చిన వ్యక్తికి రూ.50 లక్షలు బహుమానంగా ఇస్తామని' ప్రకటించారు జహాన్. వివాదంపై గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆమె ఈ సంచలన కామెంట్స్ చేశారు.
'మాయావతి వేశ్య కంటే హీనం': బీజేపీ నేత, పార్టీలో కుదుపు
ఇదిలా ఉంటే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దయాశంకర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఇబ్బందిగా పరిణమించాయి. దళిత, బీసీ వర్గాల్లో మాయావతికి ఉన్న ఫాలోయింగ్ మేరకు, దయాశంకర్ సింగ్ వ్యాఖ్యలు ఆయా వర్గాల్లో బీజేపీపై తప్పుడు సంకేతాలు పంపించేవిగా మారాయి. ఇక దయాశంకర్ సింగ్ విషయానికొస్తే.. ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి ఉన్న 15 మంది ఉపాధ్యక్షుల్లో దయాశంకర్ ఒకరు.
ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి జనరల్ సెక్రటరీగాను కొనసాగుతున్న దయాశంకర్ సింగ్, గత జూన్ లో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజా వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ దయాశంకర్ పై ఆరేళ్ల పాటు వేటు వేయగా, అరుణ్ జైట్లీ లాంటి బీజేపీ నేతలు కూడా మాయావతికి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దయాశంకర్ కోసం వెతుకుతున్న పోలీసులు, ఆయన్ను అరెస్టు చేసే పనిలో పడ్డారు.