కాంగ్రెస్ను దేశం తిరస్కరించింది.. పంజాబ్లో కూడా అదే పరిస్థితి : మాయావతి
దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారని అదే పరిస్థితి ఇప్పుడు పంజాబ్లో కూడా రాబోతుందని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు దళిత విరోధులని ఆరోపించారు. ఈ పార్టీలు దోపిడిదారులకు, పెట్టుబడిదారులు కొమ్ము కాస్తున్నాయని విమర్శలు గుప్పించారు. పంజాబ్లో బీఎస్పీ- శిరోమణి అకాలీ దళ్ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పంజాబ్లోని జలంధర్లో శిరోమణి అకాలీ దళ్- బహుజన్ సమాజ్ పార్టీ సంయుక్తంగా నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాయావతి పాల్గొన్నారు. ఈసందర్భంగా బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలపై విరుచుకుపడ్డారు. బీఎస్పీ - శిరోమణి అకాలీ దళ్ను ఎదుర్కొనే ధైర్యం ఈ పార్టీలకు లేదన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ దళిత ముఖాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల్లోకి వచ్చిందని విమర్శించారు. ఎన్నికల అప్పుడే దళిత ముఖ్యమంత్రి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి గుర్తుకు వచ్చిందని నిలదీశారు. చన్నీ సీఎం అయినప్పటికీ రిమోట్ మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేతిలో ఉటుందని ఏద్దేవా చేశారు.
పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి తిరస్కరించేందుకు సిద్ధంగా ఉన్నారని మాయవతి విమర్శించారు. 1996లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పరిస్థితులు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. నాడు 13 సీట్లలో 11 సీట్లు బీఎస్పీ- అకాలీ దళ్ కూటమి గెలుచుకుని కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించినట్లు గుర్తు చేశారు. ఈ సారి కూడా హస్తం పార్టీని ఓడిస్తుందని మాయావతి ధీమా వ్యక్తం చేశారు. బాబా కాన్షీరాం, అంబేద్కర్ల ఆశయాలను నెరవేర్చే బీఎస్పీ ఉందన్నారు. దళితులు, పేదలు, బడుగు బలహీన వర్గాలను కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.