పొంచివున్న ఆర్థికమాంద్యం - నిర్మలమ్మ సీతారామన్ బడ్జెట్ కసరత్తు షురూ: కోతలే కోతలు..!!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడిన పరిస్థితులు కనిపిస్తోన్నాయి. మల్టీనేషనల్ కంపెనీలన్నీ ఖర్చును తగ్గించుకునే దిశగా చర్యలు తీసుకుంటోన్నాయి. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టాయి. టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా సహా పలు బహుళజాతి కంపెనీలు ముందుజాగ్రత్త పడుతోన్నాయి. ఆర్థికమాంద్య పరిస్థితులను ఎలా ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయం మీద మల్లగుల్లాలు పడుతోన్నాయి.
ఆర్థిక మాంద్యం ఏర్పడితే..
ఒక్కసారి మాంద్యం తరహా పరిస్థితులు ఏర్పడితే- ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావానికి లోనవుతుంది. ఒడిదుడుకులకు గురవుతుంది. అప్పటివరకు సజావుగా సాగుతున్న లావాదేవీలన్నీ కుంటు పడతాయి. ఈ పరిణామాలు నిరుద్యోగాన్ని పెంచడం తప్పదనే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది. ఇప్పటికే ట్విట్టర్ సగం వరకు ఉద్యోగుల సంఖ్యను సగానికి తగ్గించుకుంది. ఉన్న వారికి కూడా కఠిన పని వాతావరణాన్ని కల్పించింది. అందులో పని చేస్తోన్న ఉద్యోగులకు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ హెచ్చరికలను కూడా జారీ చేశారు.
కఠిన నిర్ణయాలు..
ఫేస్బుక్ మాతృసంస్థ మెటాలోనూ ఇవే తరహా పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ సంస్థలో పని చేస్తోన్న ఉద్యోగుల్లో 13 శాతం మందిని తొలగించేలా చర్యలు తీసుకుంటోందా కంపెనీ. అక్కడితో ఆగట్లేదది. కొన్ని మల్టీ నేషనల్ కంపెనీలు సైతం అదే దారిలో సాగుతోన్నాయి. ఖర్చు తగ్గించుకోవడానికి ప్రాధాన్యతను ఇస్తోన్నాయి. ఇందులో భాగంగా కఠిన నిర్ణయాలను తీసుకోవడానికీ వెనుకాడట్లేదు.
కేంద్రంపై దృష్టి..
ఈ పరిణామాల నేపథ్యంలో- ప్రస్తుతం అందరి దృష్టి కూడా కేంద్ర ప్రభుత్వంపై నిలిచింది. ఆర్థిక మాంద్య పరిస్థితులే గనక ముంచుకొస్తే కేంద్రం ఎలాంటి చర్యలను తీసుకుంటుందనేది చర్చనీయాంశమౌతోంది. గతంలో యూపీఏ హయాంలో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ చేపట్టిన చర్యలు, సంస్కరణ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పటికీ.. భారత్పై దాని ప్రభావం పెద్దగా పడలేదు. బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉండటం వల్ల అప్పటి మాంద్యాన్ని అధిగమించగలిగింది దేశం.
ఎలాంటి చర్యలుంటాయ్..
ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మాంద్యం తరహా పరిస్థితులను ఎలా అధిగమిస్తుందనేది ఉత్కంఠను రేపుతోంది. క్రయ విక్రయాలు తగ్గితే కేంద్ర ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రోజువారీ జీఎస్టీ ఆదాయం తగ్గుతుంది. లోటు బడ్జెట్ మరింత పెరుగుతుంది. దీనితో కేంద్రం మళ్లీ అప్పుల మీద ఆధార పడాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ఈ భారాన్ని కొంతమేరకైనా తగ్గించుకోవడంలో భాగంగా సంక్షేమ పథకాల్లో కోత పెట్టే అవకాశాలు లేకపోలేదు.
బడ్జెట్ ప్రతిపాదనల కోసం..
మరో మూడు నెలల్లో 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట ప్రతిపాదనలను పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సి ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్- తన బడ్జెట్ కసరత్తును మొదలు పెట్టేశారు కూడా. ఈ ఉదయం ఆమె దేశ రాజధానిలో తొలి ప్రీ బడ్జెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పారిశ్రామికవేత్తలు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, వాతావరణ మార్పు రంగానికి చెందిన నిపుణులు, ఇతర స్టేక్ హోల్డర్లు దీనికి హాజరయ్యారు.
ప్రాధాన్యతాంశాలపై..
బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పనలో ఇవ్వాల్సిన ప్రాధాన్యతాంశాల గురించి నిర్మల సీతారామన్ వారితో చర్చిస్తోన్నారు. సీతారామన్తో పాటు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్ చౌదరి, భగవత్ కిషన్రావ్ కరద్ ఈ భేటీకి హాజరయ్యారు. ఆర్థిక శాఖ జాయింట్ కార్యదర్శి టీవీ సోమనాథన్, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఇతర శాఖల కార్యదర్శులు, ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ ఇందులో పాల్గొన్నారు.
కొనసాగనున్న సంప్రదింపులు..
ఈ భేటీ కొనసాగనుంది. మంగళవారం కూడా నిర్మల సీతారామన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, ప్రాసెసింగ్ పరిశ్రమల పెద్దలతో భేటీ కానున్నారు. ఫైనాన్స్ సెక్టార్, క్యాపిటల్ మార్కెట్ ప్రతినిధులతోనూ ఆమె సమావేశమౌతారు. 24వ తేదీన సర్వీస్ సెక్టార్, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, ఆరోగ్యం, విద్య, నీరు, పారిశుధ్యం సహా ఇతర సామాజిక రంగానికి చెందిన నిపుణులను కూడా కలుస్తారు. 28వ తేదీన ట్రేడ్ యూనియన్ ప్రతినిధులను కలుసుకుంటారు.